కెసీఆర్ వంద కోట్లు పంచారంటున్న రేవంత్
తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ ఎస్ అధినేత కెసీఆర్ పై కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం నాడు జరిగిన సమావేశంలో కెసీఆర్ బాక్సుల్లో పెట్టి ఒక్కో ఎమ్మెల్యేకు కోటి రూపాయలు ఇచ్చారని ఆరోపించారు. ఈ విషయం కొంత మంది ఎమ్మెల్యేలే తనకు చెప్పారని అన్నారు. ఈ అంశంపై నిఘా సంస్థలు ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉందని అన్నారు. తమ అధిష్టానం తెలంగాణ ప్రజలే అని ప్రకటించుకున్న సీఎం కెసీఆర్ మాట్లాడితే ఎందుకు ప్రధాని మోడీ దగ్గరకు పరుగులు పెడుతున్నారని ప్రశ్నించారు. ఇప్పుడు మోడీ కెసీఆర్ అధిష్టానంగా మారారని ఎద్దేవా చేశారు. టీఆర్ ఎస్ ఇప్పుడు తెలంగాణ బిజెపి శాఖగా మారిపోయిందని అన్నారు. కేసీఆర్ కు సహానీ అనే చీకటి స్నేహితుడు ఢిల్లీలో ఉన్నట్లు చెప్పారు. ఢిల్లీలో సహానీ లీలలు బయట పెట్టాలని కోరారు. 25 లక్షలతో ప్రగతి నివేదన సభ అంతా బోగస్ అని ఆరోపించారు.
జిల్లాల్లో అయితే ప్రజలు తంతారనే భయంతోనే హైదరాబాద్ దగ్గర సమావేశం పెడుతున్నారని ఆరోపించారు. అంతే కాదు..మంత్రి కెటీఆర్ కు ఓ ఛాలెంజ్ విసిరారు. సిరిసిల్ల నుంచి 25 వేల మంది వస్తారా?. దమ్ముంటే చెక్ పోస్టు పెట్టండి. లెక్క తేలిపోతుంది అని వ్యాఖ్యానించారు. ఇరవై ఐదు లక్షల మంది రావాలంటే రెండు లక్షల వాహనాలు రావాలని చెప్పారు.కేసీఆర్ చెబుతున్న విధంగా సభ జరిగితే నాలుగైదు వందల కోట్లు కావాలన్నారు.కేసీఆర్ కు ఇన్ని వందల కోట్లు ఎక్కడి నుండి వచ్చాయని ప్రశ్నించారు. టీఆర్ ఎస్ లో కొత్త వాళ్లకు టికెట్లిస్తే పాతోళ్లు ఓడిస్తారని,ఇప్పుడు ఉన్నోళ్లకు ఇస్తే ప్రజలు ఓడిస్తారని తెలిపారు.టీఆర్ ఎస్ ను ప్రజలు ఓడించండం ఖాయమని రేవంత్ రెడ్డి జోస్యం చెప్పారు.