హరీష్ రావుపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఎన్నికల్లో పరాజయం తర్వాత తొలిసారి మీడియాతో చిట్ చాట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన సీఎం కెసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి తల్లి చనిపోతే రెండు సార్లు వెళ్లిన కెసీఆర్..పక్కనే ఉన్న రైతుల ఆత్మహత్యల కుటుంబాలను పరామర్శించలేదన్నారు. భారత్, పాక్ మధ్య యుద్దం వస్తే ఎన్నికలు ఆరు నెలలు ఆగే అవకాశం ఉందన్నారు. కెసీఆర్ ఫ్యూడల్ అని అందుకే మహిళలకు మంత్రి పదవి ఇవ్వరని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో గెలుపు ఓటమలు సహజం అని..గత ఎన్నికల్లో ప్రజలు ఓట్లు వేయలేదని..ప్రభుత్వం వేసుకుందని అన్నారు. మాజీమంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్ రావుకు మంత్రివర్గంలో చోటు దక్కదని అన్నారు. హరీశ్తో పాటు మరో నలుగురు సీనియర్లుకు మంత్రివర్గంలో స్థానం దక్కదని పేర్కొన్నారు. కేసీఆర్ కేబినెట్లో అసమర్థులకు చోటిస్తారని అన్నారు. మిడ్ మానేరు, గౌరెల్లి, తోటపల్లి పనుల్లో సుమారు వెయ్యి కోట్లు తీసుకున్నారు. తన బినామీలకే హరీష్ కాంట్రాక్ట్లు ఇప్పించారు. ఆ డబ్బులనే కేసీఆర్కు తెలియకుండా ఎన్నికల్లో డబ్బులు పంచారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 26మందికి ఆయన డబ్బులిచ్చారు. కొందరు కాంగ్రెస్ వాళ్లకు ఇస్తానంటే తీసుకోలేదు. హరీష్..అమిత్ షాతో ఫోన్లో మాట్లాడటం కేసీఆర్కు తెలిసింది. అందుకే మంత్రి పదవి కట్. ఒకవేళ హరీశ్ ఎదురు తిరిగితే పాస్పోర్టు కేసులో ఇరికించేందుకు సీఎం సిద్ధంగా ఉన్నారు. కడియం శ్రీహరిపై ఒక్క అవినీతి ఆరోపణ లేదు. మరి ఆయనకు ఎందుకు మంత్రి పదవి ఇవ్వడం లేదు?. మాదిగలకు కేబినెట్లో చోటు కల్పించడం లేదు. అలాగే నాయిని నర్సింహారెడ్డిని పక్కనపెట్టారు. కేసీఆర్కు అహంకారం తలకెక్కింది. పాలన పక్కన పెట్టి ప్రత్యర్థులను వేధిస్తున్నారు. కేసీఆర్, నరేంద్ర మోదీల మధ్య ఫెవికాల్ బంధం. ఎన్నికల్లో యాభై లక్షలు దొరికిన పట్నం నరేందర్ రెడ్డి కేసు ఎందుకు ఈడీకి ఇవ్వరు?. ఐటీ శాఖ ఇచ్చినా కూడా ఈడీ ఎందుకు విచారణ చేపట్టడం లేదు. అదే నాపై మాత్రం ఐటీ, ఈడీ కేసులు పెట్టించారు. తన నియోజకవర్గంలో మెజారిటీ సర్పంచ్ లు తన మద్దతుదారులే గెలిచారని వెల్లడించారు.