కారుకే ‘దానం’ కన్ఫర్మ్
కాంగ్రెస్ సీనియర్ నేత దానం నాగేందర్ కారెక్కడానికే నిర్ణయించుకున్నారు. అందులో భాగంగానే తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ పథకాలపై ప్రశంసల వర్షం కురిపించారు. అదే సమయంలో కాంగ్రెస్ లో అంతా ఒక వర్గం పెత్తనమే నడుస్తోందని ఆరోపించారు. బీసీలకు పార్టీలో సరైన ప్రాధాన్యత లభించటం లేదని..గౌరవం లేని చోట ఉండటం వేస్ట్ అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయటానికి దారితీసిన కారణాల వివరిస్తూ దానం నాగేందర్ శనివారం నాడు మీడియాతో మాట్లాడారు. 30ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నా.. పార్టీ కోసం బాధ్యతగా పనిచేస్తూ వచ్చానని తెలిపారు. గ్రేటర్లో ఏదైనా నా భూజాలపై వేసుకొని పనిచేశానని పేర్కొన్నారు. అంతేకాక కాంగ్రెస్ పార్టీలో చాలా పీతలు ఉన్నాయన్నారు. బలహీన వర్గాల గురించి దివంగత నేత వైఎస్సార్ తర్వాత సీఎం కేసీఆర్ ఆలోచిస్తున్నారని వ్యాఖ్యానించారు. పార్టీ కోసం ఎంత కష్టపడి పనిచేసిన ఎదగకుండా వెనక్కి లాగుతున్నారని విమర్శించారు.
టీఆర్ఎస్ నుంచి తనకు ఎలాంటి హామీ రాలేదని దానం స్పష్టం చేశారు. అయినా టీఆర్ఎస్లో పని ఇస్తే చేస్తా.. లేకపోతే కార్యకర్తగా ఉంటానని దానం నాగేందర్ తెలిపారు. ‘అంజన్కుమార్తో తనకు ఎలాంటి విభేదాలు లేవని దానం స్ఫష్ట చేశారు. అతనికి పదవి ఇవ్వమని చెప్పిందే తానే అని దానం తెలిపారు. ‘నాకు కూడా కాంగ్రెస్లో పదవి ఫైనల్ అయింది.. పదవి వచ్చాక పోతే బాగోదని ఇప్పుడు కాంగ్రెస్ను నుంచి వెళ్లిపోతున్నానని’ దానం అన్నారు. ఢిల్లీ చుట్టూ తిరిగే వారికే ప్రాధాన్యత ఇస్తున్నారని దానం ఆరోపించారు. ‘ బీసీలకు న్యాయం చేయాలని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కోరాం. హైకమాండ్కు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదు. తెలంగాణ జనాభాలో 51శాతం బీసీలు ఉన్నారు. బడుగు, బలహీన వర్గాలకు కాంగ్రెస్ పార్టీలో గౌరవం లేకపోవడం, వారిని పక్కన పెట్టడం చాలా బాధ కలిగించింది. బస్సు యాత్రలో కూడా అతికష్టంగా బీసీ నుంచి ఒక్కరికి అవకాశం ఇచ్చారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్టీ కోసం సైనికుడిలా పనిచేస్తున్నాడు. కానీ, ఆయనను కూడా పీతల మాదిరిగా లాగుతున్నారు. సీనియర్ నాయకులు డీఎస్, కేకే దూరం కావడానికి గల కారణాలను రాహుల్ గాంధీకి వివరించాను. అంతేకాక టీపీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్ రెడ్డిని కొందరు నేతలు పనిచేయనీయడం లేదు. పొన్నాలకు పార్టీలో సరైన ప్రాధాన్యత లేదు. పార్టీలో వీహెచ్ పరిస్థితి కక్కలేక.. మింగలేక ఉన్నట్టు ఉందని’ దానం పేర్కొన్నారు.