Telugu Gateway
Politics

అవినీతిపరుల కోసం మోడీ ప్రచారం

అవినీతిపరుల కోసం మోడీ ప్రచారం
X

ప్రధాని నరేంద్రమోడీపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. సమస్యల గురించి ప్రస్తావించకుండా..మోడీ వ్యక్తిగత విమర్శలు చేయటానికే ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపించారు. ఓ వైపు అవినీతిపై పోరాడుతున్నామని చెబుతూనే...మరో వైపు అవినీతిపరుల కోసం భారీ ఎత్తున ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. యడ్యూరప్ప, రెడ్డి బ్రదర్స్ రాష్ట్ర సంపదను 35 వేల కోట్ల రూపాయలు దోచుకున్నారని ఆరోపించారు. కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ దళితులున అవమానించిందని మోడీ వ్యాఖ్యలపై స్పందిస్తూ రోహిత్ వేముల గురించి మోడీ ఎందుకు నోరెత్తలేదని ప్రశ్నించారు. దళితుల ఛాతీపై కులం పేరు రాస్తే ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. మోడీకి స్వతహగా కోపం ఎక్కువ. అందరితోనూ ఆయన అలాగే మాట్లాడతారు.

కోపిష్టులకు నేనే ఆకర్షణీయంగా కన్పిస్తానేమో. అందుకే మోడీ ఎప్పుడూ నాపై కోప్పడుతుంటారని ఎద్దేవా చేశారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో తమ విజయం ఖాయమని రాహుల్‌ గాంధీ ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికలను రెండు సిద్ధాంతాల మధ్య పోరుగా ఆయన అభివర్ణించారు. బెంగళూర్ అభివృద్ధికి కాంగ్రెస్‌ ఊతమిచ్చిందని, భవిష్యత్‌లోనూ ఈ నగరాన్ని మరింతగా తీర్చిదిద్దుతామని భరోసా ఇచ్చారు. ఈ ఎన్నికలు తన గురించో, ప్రధానమంత్రి గురించో కాదని, కర్ణాటక ప్రజల భవితవ్యానికి సంబంధించినవని అన్నారు. ప్రధాని కర్ణాటక ప్రజలకు టోకరా ఇవ్వాలని చూస్తున్నారని, కర్ణాటక ప్రజలకు ఏం చేయబోతారో వారు చెప్పడం లేదని దుయ్యబట్టారు. దేశంలో యువతకు అత్యధిక ఉద్యోగాలను కర్ణాటక సమకూరుస్తోందని చెప్పారు.

Next Story
Share it