Telugu Gateway
Telangana

మార్పు కోసమే మా ప్రయత్నం

మార్పు కోసమే మా ప్రయత్నం
X

‘ఇదేదో వచ్చే ఎన్నికల కోసం చేస్తున్న ప్రయత్నం కాదు. తెలియకుండా కొంత మంది చిల్లరమల్లర వ్యాఖ్యలు చేస్తున్నారు. మార్పు కోసమే మా ప్రయత్నం. ఎప్పటినుంచో అఖిలేష్ యాదవ్ తో ఫోన్ లో మాట్లాడుతున్నా. అందులో భాగంగానే నేరుగా చర్చలు జరిపేందుకు అఖిలేష్ హైదరాబాద్ వచ్చారు. జాతీయ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించాలని ప్రయత్నిస్తున్నాం’ అని తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ వ్యాఖ్యానించారు. ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ఎస్పీ అధ్యక్షుడు అయిన అఖిలేష్ యాదవ్ ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకుని...తెలంగాణ సీఎం కెసీఆర్ తో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్‌ యాదవ్‌ మాట్లాడుతూ.. కెసీఆర్ తో భేటీలో చాలా అంశాలపై చర్చించామని తెలిపారు. కేసీఆర్‌ ప్రభుత్వం చాలా మంచి పనులు చేస్తోందని ప్రశసించారు. రైతులు సహా అన్ని వర్గాల ప్రజల అభిమానం కేసీఆర్‌ సర్కార్‌కు ఉందన్నారు.

దేశంలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా సాగునీరుకు ప్రాముఖ్యత ఉందని, అందులో కేసీఆర్‌ ప్రభుత్వం రైతులకు ఎంతో చేస్తోందని పేర్కొన్నారు. ఇప్పటివరకూ కేంద్ర ప్రభుత్వాలు ప్రజలను తీవ్రంగా నిరాశ పరిచాయని... ఇప్పుడు ప్రజలు మార్పు కోసం ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రాంతీయ పార్టీలను ఏకం చేసే ప్రయత్నాలు చేస్తున్నామని, ప్రాంతీయ పార్టీలు, నేతలు మాత్రమే బీజేపీని అడ్డుకోగలవని అఖిలేష్‌ వ్యాఖ్యానించారు. కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కార్‌ ప్రజలకు ఏ ఒక్క హామీని అమలు చేయలేదని ఆయన విమర్శించారు. సమాజ్‌వాదీ పార్టీకి హైదరాబాద్‌తో చాలా గట్టి, పాత అనుబంధం ఉందని ఆయన గుర్తు చేసుకున్నారు. తెలంగాణ ప్రభుత్వంతో తాము బలమైన అనుబంధం కోరుకుంటున్నామని చెప్పారు. దేశ ప్రజలు ఒక కొత్త రాజకీయ పంథాను కోరుకుంటున్నారని, అందుకే కేసీఆర్‌ చేస్తున్న ప్రయత్నానికి తాము మద్దతు ఇస్తున్నామని అఖిలేష్‌ స్పష్టం చేశారు. మీడియా సమావేశానికి ముందు కేసీఆర్‌, అఖిలేష్‌ యాదవ్‌లు సుమారు నలభై నిమిషాల పాటు ఏకాంతంగా చర్చలు జరిపినట్లు సమాచారం.

Next Story
Share it