అట్టహాసంగా ‘భరత్ బహిరంగ సభ’

మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘భరత్ అను నేను’. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఫంక్షన్ శనివారం సాయంత్రం హైదరాబాద్ లో అట్టహాసంగా సాగింది. దీనికి ఓ ప్రత్యేకత కూడా ఉంది. ఈ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు ప్రముఖ హీరో జూనియర్ ఎన్టీఆర్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. అంతే కాదు..ఈ సమావేశంలో ఎన్టీఆర్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను మహేష్ ను అన్న అని పిలుస్తానని తెలిపారు. ‘‘మా ఇద్దర్నీ (మహేశ్బాబు, ఎన్టీఆర్) ఇలా చూస్తే ఫ్యాన్స్కు కొత్తగా ఉందేమో కానీ మాకు కాదు. మీరందరూ ఆయన్ని ప్రిన్స్, సూపర్స్టార్ అంటారు. నేను మహేశ్ అన్నా అంటాను. ఈ చిత్రం అద్భుతమైన విజయం సాధించాలనీ, రికార్డులు తిరగ రాయాలని కోరుకుంటున్నా. ఒక కమర్షియల్ స్టార్ అయి ఉండి కూడా మహేశ్ అన్న చేసినటువంటి ప్రయోగాత్మక చిత్రాలు ఎవరూ చేయలేదు. రిజల్ట్ తో సంబంధం లేకుండా ప్రయోగాలు చేస్తున్నారు. మేం ఇప్పుడిప్పుడు చేస్తున్నాం. దానికి స్ఫూర్తి ఆయనే. ఆయన చాలా అరుదైన నటుడు. అలాగే ఉండనిద్దాం. ‘భరత్ అనే నేను’ ఆయన కెరీర్లో ఓ మైలురాయిగా నిలిచిపోవాలి. మహేశ్బాబు మాట్లాడుతూ – ‘‘కృష్ణగారి అబ్బాయి అనే నేను... తమ్ముడు తారక్ నుంచి నేర్చుకున్నాను ఇక్కడ ప్రీ–రిలీజ్ ఫంక్షన్ చూస్తున్నట్లు లేదు.
100 డేస్ ఫంక్షన్కు వచ్చినట్లు ఉంది. తారక్ ‘ఆది’ సినిమా ఆడియో ఫంక్షన్కు నేను వెళ్లాను. ఇప్పుడు తను నా సినిమా ప్రీ–రిలీజ్ ఈవెంట్కు రావడం ఆనందంగా ఉంది. ఐ థింక్ ఇక ఫంక్షన్ల ట్రెండ్ మారుద్ది. అందరు హీరోలు వెళతారు. ఎందుకంటే మన ఇండస్ట్రీలో ఉంది ఐదారుగురు పెద్ద హీరోలే. తిప్పి కొడితే ఏడాదికి ఒక్కో సినిమానే చేస్తాం. అందరి సినిమాలూ ఆడితే ఇండస్ట్రీ ఇంకా బాగుంటుంది. మేం మేం బాగానే ఉంటాం. మీరూ మీరే (ఫ్యాన్స్) ఇంకా బాగుండాలి. సీయం క్యారెక్టర్ అనగానే కాస్త భయం వేసిందని అన్నారు. కొరటాల శివ కథ చెప్పిన తర్వాత ఆ భయం పోయిందని అన్నారు. ఈ కార్యక్రమం తర్వాత నగరంలోని ఓ హోటల్ లో వేడుక జరగగా..దానికి మరో హీరో రామ్ చరణ్ కూడా హాజరయ్యారు.