కెసీఆర్ ప్రయత్నాలకు అప్పుడే ఎదురుదెబ్బ!

తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించేందుకు చేస్తున్న ప్రయత్నాలకు ఊహించని షాక్. జాతీయ రాజకీయాలను మార్చాలంటూ కెసీఆర్ సంచలన ప్రకటన చేసిన తర్వాత స్పందించిందే తక్కువ మంది. అందులో మమతా బెనర్జీ, హేమంత్ సోరెన్ ల పేర్లు ప్రముఖంగా విన్పించాయి. అయితే తర్వాత అసలు మమతా బెనర్జీ తెలంగాణ సీఎం కెసీఆర్ కు ఫోన్ చేయలేదని..ఈయనే ఆమెకు ఫోన్ చేశారని వార్తలు వచ్చాయి. తర్వాత కూడా పెద్దగా ఏ పార్టీ నుంచి స్పందన రాలేదు. సొంత పార్టీ నేతలు...క్యాడర్ పెద్ద ఎత్తున తరలివచ్చి కెసీఆర్ కు అభినందనలు తెలిపారు. కెసీఆర్ కు మద్దతు ప్రకటించిన హేమంత్ సోరెన్ ఇప్పుడు కాంగ్రెస్ గూటికి చేరిపోయారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో కలిసి పని చేయబోతున్నట్లు ఆయన ప్రకటించారు.
మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్తో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. ‘ఈ విషయమై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో చర్చించాం. వచ్చే ఎన్నికల్లో జేఎంఎం నేతృత్వంలో పోరాడేందుకు రాహుల్ సుముఖత వ్యక్తం చేశారు’ అని తెలిపారు. కేసీఆర్పై గతంలో పొగడ్తలు గుప్పించిన సోరెన్.. 48 గంటలు గడవకముందే కూటమిపై వెనక్కి తగ్గటం విశేషం. దేశంలో బిజెపి, కాంగ్రెస్ ల కు ప్రత్యామ్నాయంగా కూటమి ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని , దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు తేవాల్సిన అవసరం ఉందని కెసీఆర్ చెబుతున్న విషయం తెలిసిందే.