Telugu Gateway
Top Stories

పేలుతున్న రాహుల్ గాంధీ పంచ్ లు

పేలుతున్న రాహుల్ గాంధీ పంచ్ లు
X

ఈ మ‌ధ్య కాలంలో కాంగ్రెస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ పంచ్ ల‌తో పేలుస్తున్నారు. ముఖ్యంగా దేశాన్ని కుదిరిపేస్తున్న పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంకు స్కాంకు సంబంధించి రాహుల్ ట్వీట్లు ప‌లువురిని ఆక‌ట్టుకుంటున్నాయి. దేశాన్ని లూటీ చేయాలంటే ప్రధాని మోదీని భార‌త్ లో కౌగిలించుకుని.. ఆయనతో దావోస్‌లో కనిపించి..రూ 12,000 కోట్లు కొట్టేసి ఎంచక్కా విదేశాలకు చెక్కేయాలంటూ రాహుల్‌ వ్యంగ్యోక్తులతో ట్వీట్‌ చేశారు. బిలియనీర్‌ జ్యూవెలర్‌ నీరవ్‌ మోదీ కుంభకోణంపై ప్రధాని మోదీని టార్గెట్‌ చేస్తూ కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్ గాంధీ ట్వీట్ల దాడిని కొనసాగిస్తున్నారు. స్కామ్‌స్టర్లు దేశాన్ని లూటీ చేసి విదేశాలకు చెక్కేయడంపై మరోసారి తనదైన శైలిలో మోదీ సర్కార్‌ను ఎండగట్టారు. ‘లమో (లలిత్‌ మోదీ).. నిమో (నీరవ్‌ మోదీ) నమో (నరేంద్ర మోదీ)ను కలిసి.. పెట్టేబేడా సర్థుకుని విదేశాలకు పారిపోయార’ని వ్యాఖ్యానించారు.

రాహుల్‌ మోదీరాబ్స్‌ఇండియా హ్యాష్‌ట్యాగ్‌తో ట్వీట్‌ చేశారు. పీఎన్‌బీ బాగోతం వెలుగుచూసే కొద్దిరోజుల ముందే నీరవ్‌ మోదీ భారత్‌ విడిచివెళ్లాడు. మరోవైపు లిక్కర్‌ కింగ్‌ విజయ్‌ మాల్యా సైతం బ్యాంకులకు రూ.వేల కోట్ల బకాయిలతో బ్రిటన్‌కు పారిపోయిన సంగతి తెలిసిందే. కాగా 2010లో ఐపీఎల్‌ స్కామ్‌ వెలుగుచూసినప్పటి నుంచి లలిత్‌ మోదీ ఇంగ్లండ్‌లో తలదాచుకుంటున్నాడు. కాంగ్రెస్ విమ‌ర్శ‌ల‌పై బిజెపి ఎదురుదాడి చేస్తున్నా...ఈ ప‌రిణామాలు బిజెపిని ఇరకాటంలోకి నెడుతున్నాయి. ఇప్పుడు విజ‌య్ మాల్యా వ్య‌వ‌హారం స‌ద్దుమ‌ణుగుతుంద‌ని భావిస్తున్న స‌మ‌యంలో నీర‌వ్ మోడీ వ్య‌వ‌హారం అధికార బిజెపిని చిక్కుల్లో ప‌డేస్తోంది.

Next Story
Share it