Telugu Gateway
Telugu

గుజరాత్ ఎన్నికలు..నువ్వా..నేనా!

గుజరాత్ రాజకీయం మారిపోయిందా?. అంటే అవునంటున్నాయి తాజా లెక్కలు. నిన్న మొన్నటి వరకూ మరోసారి బిజెపి కూల్ గా గెలిచేస్తుంది అన్న వారు సైతం ఇప్పుడు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలపై ప్రభావం చూపించగల వ్యాపారులు...పారిశ్రామికవేత్తలు ఎక్కువగా ఉండే ఈ రాష్ట్రంలో జీఎస్టీ ఓ పెద్ద మైనస్ పాయింట్ గా నిలవటం ఖాయం అని చెబుతున్నారు. దీనికి తోడు గతంలో ఎన్నడూలేని రీతిలో రాహుల్ గాంధీ కూడా నేరుగా హిందు కార్డు వాడకపోయినా దేవాలయాల సందర్శన ద్వారా హిందూ ఓట్లలో చీలికకు ప్రయత్నిస్తున్నారనే వాదన విన్పిస్తోంది. అయితే రాహుల్ దేవాలయ ప్రయోగాలు ఫలితాన్ని ఇస్తాయా? లేదా వేచిచూడాల్సిందే. మొత్తానికి గుజరాత్ ఎన్నికలు బిజెపిలో టెన్షన్ లేపుతున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా పేరుకుపోయిన ప్రభుత్వ వ్యతిరేకత కూడా కాంగ్రెస్ కు కలసి వచ్చే అవకాశం ఉంది. తాజాగా వెల్లడైన సర్వే ఫలితాలు ఇదే విషయాన్ని చెబుతున్నాయి. గుజరాత్ ఎన్నికల్లో బిజెపి, కాంగ్రెస్ లకు చెరి 43 శాతం ఓట్లు పోలవుతాయని లోక్‌నీతి-సీడీఎస్‌ లేటెస్ట్ పోల్‌ పేర్కొంది.

అయితే 182 మంది సభ్యులు ఉన్న గుజరాత్‌ అసెంబ్లీలో బీజేపీకి 91 నుంచి 99 సీట్లు వచ్చే అవకాశం ఉందని అంచనా వేసింది. కాంగ్రెస్‌కు 78 నుంచి 86 స్ధానాలు దక్కవచ్చని పేర్కొంది. ఆగస్టులో ఇదే పోల్‌ ఏజెన్సీ చేసిన సర్వేలో బీజేపీ సులభంగా 150 మార్క్‌ ను దాటుతుంటని, కాంగ్రెస్‌కు కేవలం 30 సీట్లు దక్కుతాయని తేల్చింది. హార్థిక్‌ పటేల్‌, ఇతర యువ నేతల మద్దతుతో కాంగ్రెస్‌ పార్టీ అనూహ్యంగా పుంజుకుందని ఈ సర్వే చెబుతోంది. రాహుల్ గాంధీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించనున్న తరుణంలో సాగుతున్న ఎన్నికలు కావటంతో గుజరాత్ పీఠం దక్కించుకుంటే ఈ కిక్కే వేరు ఉంటుందనే అంచనాతో కాంగ్రెస్ ఉంది. ఈ దిశగానే ఆ పార్టీ అక్కడ చెమటోడ్చుతోంది. చూడాలి ఈ ప్రయత్నాలు ఏ మేరకు ఫలితాన్ని ఇస్తాయో.

Next Story
Share it