Telugu Gateway
Telugu

మిస్ వరల్డ్ గా భారతీయ యువతి మానుషి

భారత్ కు చెందిన యువతి మానుషి చిల్లర్ ‘మిస్ వరల్డ్’ కిరీటాన్ని దక్కించుకుంది. ఆమె స్వరాష్ట్రం హర్యానా. భారత్ సుమారు 17 సంవత్సరాల తర్వాత ఈ కిరీటాన్ని చేజిక్కించుకుంది. చైనాలో జరిగిన 2017 మిస్‌ వరల్డ్‌ పోటీల్లో మొత్తం 118 మంది అందగత్తెలు పోటీపడ్డారు. ప్రేక్షకులు, న్యాయనిర్ణేతల ఓట్లను కలుపుకొని తొలుత టాప్‌-40 మందిని ఎంపిక చేశారు. అనంతరం టాప్‌-25, టాప్‌-8, చివరకు టాప్‌-3 రౌండ్లు నిర్వహించారు. టాప్‌-3లో మిస్‌ ఇండియా, మిస్‌ మెక్సికో, మిస్‌ ఇంగ్లండ్‌లు పోటీపడ్డారు. చివరి రౌండ్‌లో ప్రపంచంలో ఏ వృత్తితో ఎక్కువగా సంపాదించవచ్చన్న న్యాయనిర్ణేతల ప్రశ్నకు.. మిస్‌ ఇండియా మనూషి చిల్లర్‌ ప్రపంచంలో అన్నిటికన్నా అమ్మతనమే గొప్పదని తెలిపారు.

ఇది డబ్బుల వ్యవహారం కాదు. ప్రేమకు, గౌరవానికి ప్రతిరూపం అని పేర్కొన్నారు. అనంతరం విజేతగా మనూషి చిల్లర్‌ను ప్రకటించడంతో 2016 మిస్‌ వరల్డ్‌ నుంచి కిరీటం అందుకున్నారు. రెండోస్థానంలో మిస్‌ మెక్సికో, మూడో స్థానంలో మిస్‌ ఇంగ్లండ్‌లు నిలిచారు. 17 ఏళ్ల క్రితం బాలీవుడ్‌ నటి ప్రియాంక చోప్రా 2000 మిస్‌ వరల్డ్‌ కిరీటం దక్కించుకున్న విషయం తెలిసిందే. ఇక 2017 ఫెమినా మిస్‌ ఇండియాగా నిలిచిన ఈ హర్యానా బ్యూటీ మనూషి చిల్లర్‌ ఇప్పుడు ప్రపంచ సుందరిగా గుర్తింపు దక్కించుకున్నారు. మిస్ వరల్డ్ టైటిల్ దక్కించుకున్న మానుషి చిల్లర్ కు అభినందనలు వెల్లువలా వచ్చిపడుతున్నాయి.

Next Story
Share it