Telugu Gateway
Top Stories

అతిపెద్ద వ్యాక్సినేషన్ కు శ్రీకారం చుట్టిన మోడీ

అతిపెద్ద వ్యాక్సినేషన్ కు శ్రీకారం చుట్టిన మోడీ
X

భారత్ లో అత్యంత ప్రతిష్టాత్మక కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం మొదలైంది. ప్రధాని నరేంద్రమోడీ వర్చువల్ పద్దతిలో ఈ మహత్కార్యానికి శ్రీకారం చుట్టారు. ప్రపంచంలోనే అతి పెద్ద కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం భారత్ లో జరగనుంది. శనివారం ఉదయం 10:30 నిమిషాలకు వర్చువల్‌ ద్వారా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మోదీ పాల్గొని వ్యాక్సినేషన్‌ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ... దేశ వ్యాప్తంగా వ్యాక్సిన్‌ కోసం పెద్ద ఎత్తున ప్రజలు ఎదురుచూస్తున్నారని అన్నారు. వ్యాక్సిన్‌ కోసం శ్రమించిన శాస్త్రవేత్తలు, సంస్థలకు అభినందనలు తెలిపారు. నర్సులు, డాక్టర్లు, ఆరోగ్య కార్యకర్తలు తొలి హక్కు దారులని అన్నారు. వీరందరికీ ప్రభుత్వ ఖర్చుతో ఉచితంగా వ్యాక్సిన్‌ అందుబాటులో ఉంచుతామని పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్‌ తయారీలో భారత్‌కు చెందిన శాస్త్రవేత్తలు, సంస్థలు కీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు.

కరోనా వ్యాక్సిన్‌ రెండు డోసులను ఖచ్చితంగా తీసుకోవాలని ప్రధాని సూచించారు. టీకా వేసుకున్నా.. మాస్క్‌, సామాజిక దూరం పాటించాల్సిదేనని స్పష్టం చేశారు. ప్రధాని మోడీ తన ప్రసంగంలో ప్రముఖ తెలుగు కవి గురజాడ అప్పారావు చెప్పిన సొంత లాభం కొంత మానుకో..పొరుగు వానికి తోడుపడవోయ్‌..దేశమంటే మట్టి కాదోయ్‌.దేశమంటే మనుషులోయ్ అంటూ వ్యాఖ్యానించారు. 'ఎవరికీ ఎప్పుడు టీకా అందిస్తామో వారికి ముందుగా సమాచారం ఇస్తాం. కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు ఖచ్చితంగా వేసుకోవాలి. కరోనాకు వ్యతిరేకంగా మీ శరీరంలో వ్యాధి నిరోదక శక్తి పెరుగుతుంది. భారత్‌లో మొదటి దశలోనే 3 కోట్ల మందికి వ్యాక్సిన్ అందిస్తున్నాం. రెండో దశలో 30 కోట్ల మందికి టీకాలు ఇస్తాం. అన్నీ రక్షణ చర్యలు చూసుకునే రెండు వ్యాక్సిన్లకు అనుమతి ఇచ్చాం. వ్యాక్సిన్‌పై తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దు. భారత్ ఉత్పత్తి చేసే వ్యాక్సిన్లకు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో నమ్మకం ఉంది. ప్రపంచవ్యాప్తంగా 60శాతం మంది పిల్లలకు ఇస్తున్న పలు వ్యాక్సిన్లు భారత్‌వే. ఇతర దేశాల వ్యాక్సిన్ కంటే మన వ్యాక్సిన్లు చాలా చౌక, సులువైనది. ఈ వ్యాక్సిన్లు కరోనాపై పోరాటంలో భారత్‌కు విజయాన్ని అందిస్తాయి.

సమస్య ఎంత పెద్దదైనా మనం ఎప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు. ఒకప్పుడు మాస్క్‌ లు, పీపీఈ కిట్ల కోసం ఇతర దేశాలపై ఆధారపడేవాళ్లం. ఇప్పుడు అన్నీ మన దేశంలోనే తయారవుతున్నాయి. చనిపోయిన వారికి పద్దతిగా అంత్యక్రియలు చేయని పరిస్థితి గతంలో ఉండేది. కరోనా సమయంలో హెల్త్ వర్కర్లు, పోలీసులు.. పారిశుద్ధ్య కార్మికులు తమ కుటుంబాలను వదిలి ప్రజలకోసం పనిచేశారు. కొందరైతే పనిచేస్తునే చనిపోయారు. ప్రజల ప్రాణాలకోసం తమ ప్రాణాలను ఆహూతిచ్చారు. కరోనాపై పోరాడుతూ చనిపోయినవారందరికీ శ్రద్ధాంజలి. కరోనా తీవ్రతపై శాస్త్రవేత్తలు, సమాజానికి ఎలాంటి ఊహ లేకుండాపోయింది. కరోనా వల్ల భారత్‌ తీవ్రంగా నష్టపోతుందని ప్రపంచం భావించింది. ఇంత జనాభా ఉన్న భారత్‌ కరోనాను ఎలా తట్టుకుంటుందని అనుకున్నారు. జనవరి 30, 2020న తొలి కరోనా కేసు నమోదు అయింది. కానీ అంతకంటే రెండు వారాల ముందే హైలెవల్ కమిటీని ఏర్పాటు చేశాం. 2020, జనవరి 17న కరోనాపై తొలి అడ్వైజర్ జారీ చేశాం. కరోనాపై పోరాటంలో భారత్ చూపించిన సాహసం రాబోయే తరాలకు ఆదర్శం. జనతా కర్ఫ్యూ ప్రజలను మానసికంగా లాక్‌డౌన్‌కు సిద్ధం చేసింది. కరోనాను ఆపడానికి ఎక్కడిప్రజలు అక్కడే ఉండాలనే నిర్ణయం తీసుకున్నాం. లాక్‌డౌన్‌లో ప్రజలు ఇబ్బందులు పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం.

Next Story
Share it