Telugu Gateway
Politics

దుబ్బాక ఎన్నిక తర్వాత హరీష్ కు షాక్

దుబ్బాక ఎన్నిక తర్వాత హరీష్ కు  షాక్
X

విజయశాంతి సంచలన వ్యాఖ్యలు

కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. దుబ్బాక ఎన్నికల తర్వాత మంత్రి హరీష్ రావుకు షాక్ తప్పదని పేర్కొన్నారు. ఎంతైనా నమ్మినవారిని గొంతు కోయటంలో కెసీఆర్ అనుసరించే స్టైలే వేరు అని పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె సోషల్ మీడియాలో సుదీర్ఘ పోస్టు పెట్టారు. దుబ్బాక ఉపఎన్నిక అనంతరమే జీహెచ్ఎంసీ ఎన్నికలను నిర్వహించి.. ఫలితాలు వచ్చిన వెంటనే కేటీఆర్‌కు సీఎం పీఠం అప్పగించేందుకు కేసీఆర్ రంగం సిద్ధం చేశారని తెలిపారు. ''దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు డిపాజిట్లు రాకుండా చేయాలని కంటి మీద కునుకు లేకుండా.. చెమటోడ్చి పనిచేస్తున్న తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి హరీష్ రావు కి ఆయన మామ, సీఎం కేసీఆర్ గారు ఊహించని షాక్ ఇచ్చినట్లు చర్చ జరుగుతోంది. దుబ్బాక ఉపఎన్నిక తర్వాత జీహెచ్ఎంసీ ఎన్నికలను నిర్వహించి, ఆ ఫలితాలు వచ్చిన వెంటనే, తన తనయుడు కేటీఆర్‌ను సీఎం పదవిలో కూర్చోబెట్టేందుకు కేసీఆర్ రంగం సిద్ధం చేసినట్టు టీఆర్ఎస్ వర్గాలు ప్రచారం మొదలు పెట్టాయి.

ఈ వాదనకు బలం చేకూర్చే విధంగా... మొదటిసారి కేసీఆర్ నోట సీఎం పదవికి రాజీనామా మాట బయటకు వచ్చింది. బీజేపీ మీద నెపం పెట్టి... తాను సీఎం పదవికి రాజీనామా చేస్తానని కేసీఆర్ సంకేతాలివ్వడం భవిష్యత్ రాజకీయానికి అద్దం పడుతోందని' వ్యాఖ్యానించారు. ప్రస్తుత హోంమంత్రి, బీజేపీ మాజీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా గతంలో తెలంగాణ పర్యటనకు వచ్చినప్పుడు కేంద్ర నిధులను కేసీఆర్ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని విమర్శించారు. దీనిపై అప్పట్లో స్పందించిన కేసీఆర్ నోటికొచ్చినట్లు ఆరోపణలు చేయడం కాదు... ఆధారాలను చూపించకపోతే అమిత్ షా ని తెలంగాణ భూభాగం నుంచి కదలనివ్వనని వార్నింగ్ ఇచ్చిన విషయాన్ని ఎవరూ మర్చిపోలేదు. తర్వాత ఆ వార్నింగ్ ఏమైందో ఎవరికీ అంతుచిక్కలేదు. అంతేకాదు తనపైనా.. తన ప్రభుత్వం పైనా నిరాధార ఆరోపణలు చేస్తే, ప్రతిపక్ష నేతలను జైలుకు పంపిస్తానని కేసీఆర్ బెదిరించిన సందర్భాలు కూడా ఉన్నాయి.

తన ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తే ప్రతిపక్షాలపై విరుచుకుపడే కేసీఆర్, ఇప్పుడు సీఎం పదవికి రాజీనామా చేస్తానని కొత్త అంశాన్ని ఎందుకు తెరమీదకు తెచ్చారు అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఓ వైపు హరీష్ రావు దుబ్బాకలో ప్రచారం చేస్తూ బీజేపీ నేతల మీద విరుచుకు పడుతున్న తరుణంలో.. ఆయన ప్రచారాన్ని డామినేట్ చేసే విధంగా కేసీఆర్ బీజేపీ నేతలకు సవాల్ విసరడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ ప్రకటన బీజేపీ నేతలకే కాదు.. పరోక్షంగా హరీష్ రావు కి కూడా సంకేతం ఇచ్చినట్టే అని తెలంగాణ సమాజం భావిస్తోంది. మొత్తం మీద కేసీఆర్ రాజీనామా ప్రకటన చూస్తుంటే.. దుబ్బాక ఉపఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించిన తర్వాత (ఒకవేళ గెలిస్తే) హరీష్ రావు ఆయన మామ కేసీఆర్ గారు బంపర్ గిఫ్ట్ ఇవ్వబోతున్నారని... ఆ గిఫ్ట్ ఏమిటంటే.. తాను సీఎం పదవికి రాజీనామా చేసి, కేటీఆర్‌ను సీఎం గద్దెపై కూర్చోబెట్టబోతున్నారన్న వాదన వినిపిస్తోంది.' అని తెలిపారు.

Next Story
Share it