కెసీఆర్ నోరు మెదపరేం!
తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ పై కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో మండిపడింది. లక్షలాది మంది విద్యార్ధులతో ఇంటర్ బోర్డు ఇష్టానుసారం ఆడుకున్నా..సీఎం కెసీఆర్ ఇంత వరకూ స్పందించకపోవటం దారుణమన్నారు. ఇంటర్ బోర్డు అధికారుల నిర్లక్ష్యం విద్యార్ధుల భవిష్యత్ ను నాశనం చేసిందని అన్నారు. ఈ మేరకు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రతిపక్ష నేత మల్లు భట్టి విక్రమార్కలు సీఎం కెసీఆర్ కు లేఖ రాశారు. లక్షలాది మంది విద్యార్ధులకు సంబంధించిన వ్యవహారంపై ప్రభుత్వం స్పందించే తీరు ఇదేనా? అని ప్రశ్నించారు. బోర్డు అధికారులను సస్పెండ్ చేసి..పూర్తి స్థాయిలో రీ వాల్యూయేషన్ చేయించాలని డిమాండ్ చేశారు. మరో వైపు బోర్డులో జరిగిన పరిణామాలపై సీఎం కేసీఆర్కు ఏఐసీసీ అధికారప్రతినిధి దాసోజు శ్రవణ్ కుమార్ కూడా బహిరంగ లేఖ రాశారు. ఇంటర్ బోర్డ్ తప్పిదం వల్ల 25 మంది విద్యార్ధులు ఆత్మహత్య చేసుకొని, వేలాది మంది రొడ్డెకినా కనీసం భరోసం కల్పించలేని స్థితిలో ప్రభుత్వం ఉండటం బాధకరమన్నారు.
ఒక కమిటీ వేసి నిమ్మకు నిరెత్తనట్లుగా వ్యవహరించడం శోచనీయమన్నారు. ఇంటర్ బోర్డు అధికారులు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. అనుభవం లేని గ్లోబరెనా అనే సంస్థ మూలంగా వేలాదిమంది విద్యార్థుల జీవితాలు అందకారంలోకి నెట్టబడ్డాయన్నారు. నిబంధనలకు విరుద్ధంగా గ్లోబరెనా సంస్థకు మూల్యాంకనం బాధ్యతలు ఇచ్చిన విధానంపై న్యాయవిచారణ జరిపించాలన్నారు. విద్యార్థుల తల్లిదండ్రుల పట్ల దురుసుగా ప్రవర్తించిన అశోక్ అనే అధికారిని బర్త్రఫ్ చేయాలని డిమాండ్ చేశారు. సాధికారికత లేని కమిటీ వేసి ప్రభుత్వం చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నారని, మున్నాభాయ్ ఎంబీబీఎస్లా విద్యాశాఖమంత్రి వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఇంబర్బోర్డ్ అవకతవకలపై మంత్రి మాట్లాడరు అని, ముఖ్యమంత్రి కనబరని ఎద్దేవా చేశారు.