Telugu Gateway
Politics

‘టైమ్స్ నౌ’ సర్వేలో వైసీపీకీ 20 ఎంపీ సీట్లు

‘టైమ్స్ నౌ’ సర్వేలో వైసీపీకీ 20 ఎంపీ సీట్లు
X

తొలి దశ ఎన్నికల ప్రచారం ముగుస్తున్న వేళ సర్వేల హోరు పెరిగింది. హాట్ హాట్ గా సాగుతున్న ఏపీ అసెంబ్లీకి సంబంధించి సోమవారం నాడు రెండు సర్వేలు వెల్లడయ్యాయి. రెండింటిలోనూ ప్రతిపక్ష వైసీపీకే అనుకూల ఫలితాలు రావటం విశేషం. ప్రముఖ జాతీయ ఛానల్ టైమ్స్ నౌ, వీఎంఆర్ లు సంయుక్తంగా నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో వైసీపీకి భారీ మెజారిటీ దక్కే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఏపీలో ఉన్న 25 లోక్‌సభ స్థానాల్లో ఆ పార్టీ 20 చోట్ల ఘన విజయం సాధిస్తుందని టైమ్స్‌ నౌ పేర్కొంది. అధికార టీడీపీ కేవలం 5 సీట్లకే పరిమితమవుతుందని తెలిపింది. వైసీపీకి 43.7 శాతం ఓట్లు, టీడీపీ 35.1 శాతం ఓట్లు సాధిస్తాయని తెలిపింది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఖచ్చితమైన అంచనాలు వెలువరించిన వీడీపీ అసోసియేట్స్ కూడా సోమవారం నాడు తన అంచనాలను బహిర్గతం చేసింది. ఈ ఎన్నికల్లో వైసీపీ స్పష్టమైన మెజారిటీ దక్కించుకుంటుందని తెలిపింది. ఏపీలో ఉన్న 175 సీట్లకు గాను వైసీపీ 106 నుంచి 118 సీట్లు సాధిస్తుందని వెల్లడించింది. అధికార టీడీపీ 68 నుంచి 54 సీట్లు సాధిస్తుందని తెలిపింది. జనసేన ఒకటి నుంచి మూడు సీట్లు సాధించే అవకాశముందని పేర్కొంది. బీజేపీ, కాంగ్రెస్‌ సహా బీఎస్పీ, సీపీఐ, ఇతరులెవరూ ఖాతా తెరిచే ఛాన్స్ లేదని పేర్కొంది. వైఎస్సార్‌సీపీ 43.85 శాతం ఓట్లు, టీడీపీ 40 శాతం ఓట్లు, జనసేన 9.8 శాతం ఓట్లు సాధిస్తాయని వెల్లడించింది.

Next Story
Share it