Telugu Gateway
Telangana

కెసీఆర్ సమీక్షించారు..కీలక నిర్ణయాలొచ్చాయ్

కెసీఆర్ సమీక్షించారు..కీలక నిర్ణయాలొచ్చాయ్
X

ఎట్టకేలకు తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ ఇంటర్ బోర్డు వ్యవహారంపై సమీక్ష నిర్వహించారు. ఇంటర్ ఫలితాల వెల్లడి తర్వాత పదుల సంఖ్యలో విద్యార్ధులు ఆత్మహత్య చేసుకోవటం..బోర్డు అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి రావటంతో పెద్ద దుమారమే రేగింది. ఇంటర్ బోర్డు దగ్గర విద్యార్ధులు..వారి తల్లిదండ్రులతోపాటు..విద్యార్ధి సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగిన విషయం తెలిసిందే. రాజకీయ పార్టీలు కూడా విద్యార్ధులకు మద్దతు పలికాయి. ఈ తరుణంలో సీఎం కెసీఆర్ రంగంలోకి దిగారు. విద్యా శాఖ మంత్రి, ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇందులో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పరీక్షల్లో ఫెయిలయిన విద్యార్థులందరి పేపర్లను ఉచితంగా రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. పాసైన విద్యార్థులు కూడా రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ కోరుకుంటే గతంలో ఉన్న పద్ధతి ప్రకారమే ఫీజు తీసుకుని చేయాలని సీఎం ఆదేశాలు ఇచ్చారు. రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ ప్రక్రియను వీలయినంత త్వరగా ముగించి విద్యా సంవత్సరం కోల్పోకుండా అడ్వాన్స్‌ డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించాలని పేర్కొన్నారు. రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్, అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణ ప్రక్రియనంతా పర్యవేక్షించే బాధ్యతను విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్‌ రెడ్డికి ముఖ్యమంత్రి అప్పగించారు.

ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల వెల్లడి అనంతరం తలెత్తిన పరిణామాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం ప్రగతిభవన్‌లో సమీక్ష నిర్వహించారు. ‘ఈ ఏడాది 9.74 లక్షల మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ పరీక్షలు రాశారు. వారిలో 3.28 లక్షల మంది విద్యార్థులు ఫెయిలయ్యారు. మార్కులను కలిపే క్రమంలో కొన్ని తప్పులు దొర్లడం వల్ల తమకు రావాల్సిన మార్కులకన్నా తక్కువ మార్కులొచ్చి, ఫెయిలయ్యామని కొంత మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు భావిస్తున్నారు. కాబట్టి వారి అనుమానాలు నివృత్తి చేయడానికి ఫెయిలయిన విద్యార్థులకు ఉచితంగా రీ వెరిఫికేషన్ చేయించుకునే వెసులుబాటు కల్పించాలి. విద్యార్థి ఏ సబ్జెక్టులోనైతే ఫెయిలయ్యారో ఆ పేపర్‌ను రీ వెరిఫికేషన్ చేయాలి. రీ కౌంటింగ్ చేయాలి. పాసైన విద్యార్థులకు కూడా రీ వెరిఫికేషన్ కోరుకుంటే గతంలో అనుసరించిన పద్ధతి ప్రకారమే ఫీజు తీసుకుని రీ వెరిఫికేషన్ చేయాలి. రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ ప్రక్రియను వీలయినంత త్వరగా ముగించాలి. నీట్, జేఈఈ లాంటి దేశ వ్యాప్త ప్రవేశ పరీక్షలకు విద్యార్థులు హాజరు కావాల్సి ఉన్నందున వీలయింత త్వరగా అడ్వాన్సుడు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించి, ఫలితాలు వెల్లడించాలి’ అని ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ‘ఇంటర్మీడియెట్‌తో పాటు ఎంసెట్‌ తదితర ప్రవేశార్హత పరీక్షల విషయంలో కూడా ప్రతీసారి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రభుత్వం, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అనవసరంగా తలనొప్పులు భరించాల్సి వస్తున్నది. ఈ పరిస్థితిని నివారించాలి. పరీక్షల నిర్వహణను స్వతంత్ర్య సంస్థకు అప్పగించే అవకాశాలను పరిశీలించాలి.

మెరుగైన పరీక్షల నిర్వహణ ఏ దేశంలో, ఏ రాష్ట్రంలో ఉందో అధ్యయన చేసి, ఆ పద్ధతులను మన రాష్ట్రంలో అమలు చేయాలి. భవిష్యత్తులో ఎలాంటి తలనొప్పులు లేని పరీక్షల విధానం తీసుకురావాలి. దీనికోసం ఇప్పటి నుంచే కసరత్తు చేయాలి. రాష్ట్రంలో ఎన్నో రుగ్మతలను నివారించగలిగాం. ఎన్నో సమస్యలను పరిష్కరించగలిగాం. అలాంటిది పరీక్షల నిర్వహణలో తలనొప్పులు నివారించడం అసాధ్యమేదీ కాదు’ అని ముఖ్యమంత్రి చెప్పారు. ‘ఇంటర్మీడియట్ లో ఫెయిలయ్యామనే బాధతో కొంత మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం అత్యంత బాధాకరం. ఈ వార్తలు చూసి నేను చాలా బాధ పడ్డాను. విద్యార్థుల ఆత్మహత్యలు అత్యంత దురదృష్టకరం. ఇంటర్మీడియట్ చదువు ఒక్కటే జీవితం కాదు. పరీక్షల్లో ఫెయిలయితే జీవితంలో ఫెయిలయినట్లు కాదు. ప్రాణం చాలా ముఖ్యమైనది. పరీక్షల్లో ఫెయిలయినప్పటికీ చదువులో, జీవితంలో ఎన్నో అవకాశాలుంటాయి. అభిరుచి, సామర్థ్యాన్ని బట్టి ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని, వృత్తులను ఎంచుకుని రాణించాలి. జీవితంలో నిలబడాలి. పిల్లలు ధైర్యంగా ఉండాలి. మీరు చనిపోతే తల్లిదండ్రులకు తీరని దుఃఖం మిగులుతుంది. వారికది ఎన్నటికీ తీరని లోటు. విద్యార్థులెవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని వేడుకుంటున్న’ అని ముఖ్యమంత్రి అన్నారు.

Next Story
Share it