Telugu Gateway
Politics

జీవీఎల్ నరసింహరావుకు షాక్

జీవీఎల్ నరసింహరావుకు షాక్
X

బిజెపి నేత, ఆ పార్టీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు కు షాక్. ఆయన గురువారం నాడు ఢిల్లీలో విలేకరుల సమావేశం నిర్వహిస్తున్న సమయంలో ఊహించని ఘటన ఎదురైంది. ఓ వ్యక్తి ఆయనపైకి చెప్పు విసిరేశారు. ఆ తర్వాత వెంటనే అప్రమత్తమైన కార్యాలయ సిబ్బంది చెప్పు విసిరిన వ్యక్తిని పట్టుకుని బయటకు తీసుకెళ్లి చితకబాదారు. వేగంగా దూసుకొచ్చిన చెప్పు జీవీఎల్‌ ముఖం దాటి ఆయన భూజానికి తాకింది. దీంతో జీవీఎల్ ఒక్కసారిగా షాకయ్యారు. చెప్పు విసిరిన వ్యక్తి ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌కు చెందిన శక్తి భార్గవ్‌గా గుర్తించారు. అతను ఎందుకు ఇలాంటి దుశ్చర్యకు పాల్పడ్డారో తెలియాల్సి ఉంది.

శక్తిభార్గవ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. శక్తి భార్గవ్‌ ఓ పాత్రికేయుడని, నరేంద్ర మోదీపై అసంతృప్తితోనే ఇలా చేసి ఉంటారని భావిస్తున్నారు. జీవీఎల్ నరసింహారావు ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్న విషయం తెలిసిందే. గత కొంత కాలంగా జీవీఎల్ విపక్షాలపై విమర్శల విషయంలో చాలా దూకుడుగా వ్యవహరిస్తున్నారు. అలాగే విపక్షాలు కూడా ఆయనపై అంతే స్థాయిలో ఎదురుదాడికి దిగుతున్నాయి. ఈ తరుణంలో ఆయనపై చెప్పు దాడి కలకలం రేపుతోంది. ఈ ఘటనపై జీవీ ఎల్ స్పందిస్తూ ఇలాంటి వాటికి తాను భయపడనని..కాంగ్రెస్ వాళ్ళే ఇలాంటి పనులు చేయిస్తారని ఆరోపించారు.

Next Story
Share it