Telugu Gateway
Politics

కాంగ్రెస్ గెలుపు కోసం చంద్రబాబు ఆరాటం!

కాంగ్రెస్ గెలుపు కోసం చంద్రబాబు ఆరాటం!
X

కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎంత ఆరాటపడుతున్నారో తెలియదు కానీ..టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మాత్రం ఆ పార్టీ గెలుపు కోసం తెగ తపన పడుతున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నారు చంద్రబాబు. ఏపీలో మాత్రం తూచ్ అన్నారు. అక్కడితో ఆగారా? అంటే అదీ లేదు. ఇప్పుడు మహారాష్ట్రలో కాంగ్రెస్ అభ్యర్ధుల గెలుపు కోసం ప్రచారం చేస్తున్నారు. ఈ మధ్యే రెండుసార్లు కర్ణాటకలో కూడా కాంగ్రెస్, జెడీఎస్ అభ్యర్ధుల ప్రచారం కోసం ఏకంగా రాహుల్ గాంధీతో కలసి మరీ ప్రచారం చేశారు. చూస్తుంటే కాంగ్రెస్ గెలుపు రాహుల్ గాంధీ కంటే చంద్రబాబుకే అత్యంత అత్యవసరం అన్న చందంగా తయారైంది పరిస్థితి. ఏపీని రెండు ముక్కలు చేసిన కాంగ్రెస్ పై చంద్రబాబు చేసిన విమర్శలు అన్నీ ఇన్నీ కావు. ఏపీ ప్రజలను అంతగా మోసం చేసిన కాంగ్రెస్ కోసం చంద్రబాబు ఇంతగా తాపత్రయ పడటానికి కారణం ఏంటి?. తన రాజకీయ అవసరాల కోసం చంద్రబాబు ఎప్పుడైనా..ఎవరితో అయినా పొత్తు పెట్టుకోగలరని ఇప్పటికే పలుమార్లు నిరూపితం అయింది. గోధ్రా అల్లర్ల సమయంలో అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీపై తీవ్ర విమర్శలు చేసి..జన్మలో బిజెపితో కలవనని శపథం కూడా చేశారు.

ఆ శపథాన్ని తీసి గట్టున పెట్టి..2014 ముందు మోడీ వేవ్ ను గుర్తించి బిజెపితో జట్టుకట్టారు. మళ్ళీ బయటకు వచ్చి..గోద్రా అల్లర్ల గురించి మాట్లాడే తెగువ..ధైర్యం చంద్రబాబుకు తప్ప ఎవరికీ లేదు. అంతే కాదు..అల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచి ఏపీ రైతుల ప్రయోజనాలకు గండికొట్టిన దేవేగౌడ, ఆయన మనవడి కోసం...బాబ్లీ వంటి అక్రమ నిర్మాణం చేపట్టి తెలుగు ప్రజలకు అన్యాయం చేసిన కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం చంద్రబాబు ఏదైతే చేస్తున్నారో అది..‘మహా అద్భుతం’. తెలుగు ప్రజలు ఆయన సేవలను నిత్యం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పకతప్పదు. ఏపీ ప్రజలను ఎంతో బాధించిన విభజన చేసిన కాంగ్రెస్ తోనే ఎంతో ఈజీగా జట్టుకట్టిన చంద్రబాబుకు ఆల్మట్టి..బాబ్లీ ప్రాజెక్టుల నష్టం ఓ పెద్ద లెక్కా?. చంద్రబాబుకు ఆయనకు ఉపయోగం పడే రాజకీయం ఉంటే చాలు. ఇంకేమి అక్కర్లేదు అనటానికి ఇవి చాలవా?

Next Story
Share it