గెలుస్తాం..శాసిస్తాం
తెలంగాణలో పదహారు ఎంపీ సీట్లు గెలుస్తాం. ఆ తర్వాత కేంద్రంలోని ప్రభుత్వాన్ని శాసిస్తాం. ఇదీ తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) సీనియర్ నేత, మాజీ మంత్రి టి. హరీష్ రావు వ్యక్తం చేసిన ధీమా. పదహారు సీట్లు దక్కించుకుని కేంద్రాన్ని శాసించడమే టీఆర్ఎస్ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ నెల 8న టీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అధ్యక్షతన మెదక్ పార్లమెంటరీ స్థాయి నియోజకవర్గ ముఖ్యకార్యకర్తల సమావేశం ఏర్పాట్లను పరిశీలించారు. సన్నాహక సభకు సీఎస్ఐ చర్చి మైదానాన్ని ఫైనల్ చేసినట్లు వెల్లడించారు.
అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రజలు టీఆర్ఎస్వైపే ఉన్నారని, రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలోని ఎంపీ సీట్లన్నింటినీ భారీమెజార్టీతో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం.. టీఆర్ఎస్పై ఆధారపడే విధంగా గెలుపొంది రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడమే ఏకైక లక్ష్యంగా సమావేశం ఏర్పాటు చేసినట్లు వివరించారు.