Telugu Gateway
Telangana

ఎమ్మెల్సీ ఎన్నికలను బహిష్కరించిన కాంగ్రెస్

ఎమ్మెల్సీ ఎన్నికలను బహిష్కరించిన కాంగ్రెస్
X

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. టీఆర్ఎస్ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ ఇప్పటికే ఐదుగురు ఎమ్మెల్యేలను తన వైపు తిప్పుకోవటంతో కాంగ్రెస్ ఈ నిర్ణయం తీసుకుంది. పార్టీ ఫిరాయింపులకు నిరసనగా కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి సోమవారం మీడియా వేదికగా స్పష్టం చేశారు. దీంతో మంగళవారం జరిగే ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు ఏకపక్షం కానున్నాయి. ఐదు స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా అధికార టీఆర్ఎస్ పార్టీ మిత్రపక్షం ఎంఐఎంతో కలిసి 5 స్థానాలకు అభ్యర్థులను బరిలో నిలిపింది. ఇక కాంగ్రెస్‌ తరఫున గూడూరు నారయణ రెడ్డి బరిలోకి దింపగా.. ఆ పార్టీకి చెందిన ఒక్కో ఎమ్మెల్యే అధికార పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. సీఎం కేసీఆర్‌ ఫిరాయింపులతో ప్రతిపక్షమే లేకుండా చేయాలని చూస్తున్నారని ఈ సందర్భంగా ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి మండిపడ్డారు. టీడీపీ, కాంగ్రెస్‌ పార్టీల ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేసి పార్టీలో చేర్చుకుంటున్నారని ధ్వజమెత్తారు.

ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదమన్నారు. ‘కూటమిగా పోటీచేసిన మాకు 19 మంది ఎమ్మెల్యేలు, టీడీపీ నుంచి ఇద్దరు ఎమ్మెల్యేల బలం ఉండటంతో ఒక ఎమ్మెల్సీ గెలిచే అవకాశం ఉంది. అందుకే మేము ఒక అభ్యర్థిని నిలబెట్టాం. కానీ సీఎం కేసీఆర్‌ ఫిరాయింపులతో మా ఎమ్మెల్యేలను లాక్కొంటున్నారు. సీఎం వైఖరికి నిరసనగా.. ఈ ఎన్నికలను మేం బహిష్కరిస్తున్నాం. ప్రధాని ఎవరనేది ప్రజలు నిర్ణయించాలి. మత రాజకీయాలు చేస్తున్న మోదీ కావాలా? త్యాగాలు చేసే రాహుల్‌ గాంధీ కావాలా? 16 ఎంపీలను గెలిపించాలంటున్న టీఆర్‌ఎస్‌ గత 5 ఏళ్లలో ఏం చేసింది. ఒక్క నంది ఎల్లయ్య మినహా మిగతా ఎంపీలంతా టీఆర్‌ఎస్‌, వారి మిత్రపక్షాలే కదా. 16 మంది ఎంపీలు ఉండి కూడా విభజన హామీలు సాధించలేదని ధ్వజమెత్తారు. 19 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల్లో ఇప్పటికే ఆత్రం సక్కు, రేగా కాంతారావు, చిరుమర్తి లింగయ్యలు పార్టీని వీడుతున్నట్టు ప్రకటించారు. వీరికి తోడు ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియా నాయక్‌, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కూడా కేసీఆర్‌ నాయకత్వంలో పనిచేయాలని భావిస్తున్నట్లు ప్రకటించారు.

Next Story
Share it