‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
ఎన్నో వివాదాలు ఎదుర్కొంటున్న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాకు లైన్ క్లియర్ అయింది. ఎలాగైనా ఈ సినిమా విడుదల కాకుండా చేసేందుకు ఏపీలోని అధికార తెలుగుదేశం పార్టీ సర్వశక్తులు ఒడ్డుతోంది.. దీనికి రకరకాల మార్గాలు అన్వేషిస్తోంది. ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న లక్ష్మీస్ ఎన్టీఆర్, లక్ష్మీస్ వీరగ్రంథం సినిమాల విడుదలను ఆపాలంటూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఎన్నికల సమయంలో ఈ రెండు సినిమాలు విడుదల చేయవద్దు అంటూ సత్యనారాయణ అనే వ్యక్తి లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ సమయంలో సినిమాలు విడుదల చేస్తే శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందని పిటిషనర్ కోర్టుకు తెలియజేశారు.
విచారణ జరిపిన హైకోర్ట్.. ప్రతీ వ్యక్తికి భావ ప్రకటనా స్వేచ్ఛ ఉంటుందని, కావున ఈ రెండు సినిమాల విడుదలను ఆపటం కుదరదని తేల్చి చెప్పింది. రిలీజ్ను ఆపాలంటూ దాఖలైన పిటిషన్ను హైకోర్టు కొట్టేసింది. రెండు సినిమాల్లో సన్నివేశాలు ఏవైనా అభ్యంతరకరంగా వాటిపై చర్యలు తీసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. తెలంగాణలో సినిమా విడుదల చేసిన ఎలాంటి ఇబ్బంది లేదని, శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా తమ పోలీసులు అన్ని రకాల చర్యలు తీసుకుంటారని హైకోర్టుకు రాష్ట్ర అడ్వకేట్ జనరల్ తెలిపారు. దీంతో సినిమా విడుదలకు ఉన్నత న్యాయస్థానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.