ఏప్రిల్ 11నే ఏపీ అసెంబ్లీ, తెలంంగాణ లోక్ సభ ఎన్నికలు
మే 23న ఫలితాల వెల్లడి
సార్వత్రిక ఎన్నికల గంట మోగింది. కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ ప్రకటించింది. లోక్ సభతో పాటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. దేశ వ్యాప్తంగా ఈ సారి ఏడు దశల్లో లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. ఓట్ల లెక్కింపు మే 23న జరగనుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఒకేసారి లోక్ సభ ఎన్నికలు పూర్తి కానున్నాయి. ఏప్రిల్ 11న ఏపీ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 22 రాష్ట్రాల్లో ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి. లోక్ సభ ఎన్నికల్లో ఈ సారి దేశ వ్యాప్తంగా 90 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 2014 ఎన్నికలతో పోలిస్తే ఈ సారి అదనంగా లక్ష పోలింగ్ స్టేషన్స్ పెంచారు.
దేశ వ్యాప్తంగా పది లక్షల పోలింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేయనున్నారు. నేర చరిత్ర ఉన్న అభ్యర్ధులు పత్రికల్లో ప్రకటనలు ఇవ్వాల్సి ఉందని తెలిపారు. ఎన్నికల తేదీలను ప్రకటించటానికి ఆయా రాష్ట్రాల్లో పరీక్షలు..పండగలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటున్నట్లు సీఈసీ సునీల్ ఆరోరా మీడియా సమావేశంలో వెల్లడించారు. స్వేచ్చాయుత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. షెడ్యూల్ ప్రకటనతో ఆదివారం నుంచి దేశ వ్యాప్తంగా కోడ్ అమల్లోకి వచ్చినట్లు అయింది. ఎవరైనా ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోనున్నట్లు అరోరా స్పష్టం చేశారు.