పార్లమెంట్ ఎన్నికలకు దూరం..అసెంబ్లీ బరిలోనే
దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ ఎన్నికల బరిపై మరింత క్లారిటీ ఇఛ్చారు. తమ పార్టీ లోక్ సభ ఎన్నికల బరిలో ఉండటం లేదని..అదే సమయంలో తాము ఎవరికీ మద్దతు ఇవ్వటం లేదని స్పష్టం చేశారు. తన పోటోలు, పార్టీ గుర్తులు ఏ రాజకీయ పార్టీ కూడా వాడరాదని స్పష్టం చేశారు. తమ టార్గెట్ అసెంబ్లీ ఎన్నికలే అని స్పష్టం చేశారు. ఒకవేళ అలా చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని రజనీకాంత్ హెచ్చరించారు. తమిళనాట నెలకొన్న ప్రధానమైన నీటి సమస్యను తీరుస్తారనే నమ్మకం ఉన్నవారికే ఓటు వేయాలని ఆయన ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఈ మేరకు రజనీకాంత్ ఓ ప్రకటన విడుదల చేసి అందరినీ ఆశ్చర్యపర్చారు. రజనీ మక్కల్ మండ్రం పార్టీ టార్గెట్ 2021లో జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలేనని వెల్లడించారు. రజనీకాంత్ నిర్ణయం ఎవరికి మేలు చేస్తుంది?. ఎవరి కోసం నిర్ణయం తీసుకుని ఉంటారనే కోణంలోనూ రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. తమిళనాడులోని అధికార ఏఐఏడీఎంకెతో పొత్తు పెట్టుకోవటం ద్వారా తమిళనాడులో పట్టు సాధించేందుకు బిజెపి ప్రయత్నాలు చేస్తోంది. రెండు పార్టీల మధ్య పొత్తు కూడా ఉండే అవకాశం ఉందని బలంగా ప్రచారం సాగుతోంది. ఈ తరుణంలో రజనీకాంత్ ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది.