Telugu Gateway
Politics

వైసీపీలోకి కిల్లి కృపారాణి

వైసీపీలోకి కిల్లి కృపారాణి
X

ఏపీలోని ప్రధాన ప్రతిపక్షం వైసీపీలోకి రాజకీయ వలసలు కొనసాగుతున్నాయి. అధికార టీడీపీతో పాటు..ఏపీలో రాజకీయంగా ఉనికి కోల్పోయిన కాంగ్రెస్ నేతలు కూడా క్యూకడుతున్నారు. కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి మంగళవారం నాడు హైదరాబాద్ లో పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. అంతకు ముందు ఆమె కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తూ లేఖను కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి పంపారు. జగన్ తో భేటీ అనంతరం కృపారాణి మీడియాతో మాట్లాడుతూ ఈనెల 28న అమరావతిలో జరిగే కార్యక్రమంలో వైసీపీలో చేరనున్నట్టు తెలిపారు. వైఎస్‌ జగన్‌ను సీఎం చేయడానికి కృషి చేస్తానని చెప్పారు.

బీసీ గర్జనలో వైఎస్‌ జగన్‌ ఇచ్చిన హామీలను పూర్తిగా విశ్వసిస్తున్నానన్నారు. చంద్రబాబు బీసీలను వాడుకొని వదిలేస్తారు.. వైఎస్‌ జగన్ మాట తప్పరు, మడమ తిప్పరని అన్నారు. ప్రత్యేక హోదాపై చంద్రబాబు మాట మార్చారని, ఏపీ ప్రజలు ఆయన మాటలు విశ్వసించరని అన్నారు. కాంగ్రెస్, టీడీపీతో కాంగ్రెస్‌ పొత్తును తాను తీవ్రంగా వ్యతిరేకించానని.. రాహుల్ గాంధీకి లేఖ కూడా రాశానని వెల్లడించారు. బీసీలను, కులవృత్తుల వారిని చంద్రబాబు మోసం చేశారని విమర్శించారు. టిక్కెట్‌ ఆశించి రాలేదని, భేషరతుగా వైఎస్సార్‌సీపీలో చేరనున్నట్టు కృపారాణి స్పష్టం చేశారు.

Next Story
Share it