రెండు సీట్లకు అభ్యర్ధులను ప్రకటించిన పవన్ కళ్యాణ్
గుంటూరులో నిర్వహించిన ‘జనసేన శంఖారావం’లో ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రెండు సీట్లను ప్రకటించారు. గుంటూరు లోక్ సభకు తోట చంద్రశేఖర్, తెనాలి అసెంబ్లీ బరి నుంచి నాదెండ్ల మనోహర్ బరిలో ఉంటారని వెల్లడించారు. అదే సమయంలో పవన్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతిలో జనసేన జెండా ఎగరేస్తామని ప్రకటించారు. తమ పార్టీని దెబ్బకొట్టేందుకు ఎన్ని వ్యూహాలు అమలు చేసినా..దానికి విరుగుడుగా ప్రతి వ్యూహాలు అమలు చేయగల సత్తా తమకుందని వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో పోటీ విడివిడిగా చేసినా ఏపీకి ప్రత్యేక హోదా, విభజన అంశాలపై పోరాటానికి కలసి రావాలని పవన్ కళ్యాణ్ ఈ సమావేశం ద్వారా టీడీపీ,వైసీపీలను కోరారు. అధికారమే కావాలనుకుంటే తనకు ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు ఎప్పుడో వచ్చేవని వ్యాఖ్యానించారు.
అవినీతి రాజకీయాలతో విసిగిపోయామని..రాజకీయ వ్యవస్థ ప్రక్షాళన కోసమే తాను వచ్చానని తెలిపారు. చంద్రబాబు, జగన్ లు క్షేత్రస్థాయిలో పరిస్థితులను పట్టించుకోకుండా ఎలాగా అధికారంలో కొనసాగాలనే అంశంపైనే ఫోకస్ పెడుతున్నారని విమర్శించారు. ఎట్ హోంలో తెలంగాణ నేతలతో భేటీకి వక్రభాష్యాలు చెప్పటం సరికాదన్నారు. రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారికి, పోరాటం చేసే వాళ్ళన్నా తనకు ఎంతో గౌరవం ఉందని వ్యాఖ్యానించారు. తాను ఏదైనా చేయాలనుకుంటే ప్రజలకు చెప్పిన తర్వాతే చేస్తానని ప్రకటించారు.