Telugu Gateway
Telangana

కెసీఆర్ ‘కొత్త రికార్డు’!

కెసీఆర్ ‘కొత్త రికార్డు’!
X

తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ కొత్త ‘రికార్డు’ సృష్టించబోతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నడూ ఆ రికార్డు నమోదు కాలేదు. కేవలం ‘ఇద్దరి’తోనే తొలిసారి మంత్రివర్గ సమావేశం జరగనుంది. ముందస్తు ఎన్నికల్లో అప్రతిహత విజయాన్ని దక్కించుకున్న కెసీఆర్ తనతో పాటు కేవలం ఒక్క మహమూద్ అలీకి మాత్రమే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఆయనకు తర్వాత హోం శాఖ కేటాయించిన సంగతి తెలిసిందే. దీంతో సీఎంతో కలుపుకుని కేబినెట్ లో ఉన్నది ఒకరే మంత్రి. ఇద్దరితో మంత్రివర్గ సమావేశం జరిగిన దాఖలాలు గతంలో ఎన్నడూ లేవని ఓ సీనియర్ నేత వెల్లడించారు. ఇఫ్పుడు కెసీఆర్ నిర్వహించబోయే మంత్రివర్గ సమావేశం ఓ కొత్త రికార్డుగా నిలబోతోంది. శాసనసభ సమావేశాల నిర్వహణకు ఆమోదంతో పాటు మరికొన్ని నిర్ణయాలు తీసుకునేందుకు మంత్రివర్గ సమావేశం అని చెబుతున్నారు. ఈ తరహా సమావేశాలు దేశంలోనే అరుదుగా జరిగి ఉంటాయని ఓ అధికారి వ్యాఖ్యానించారు.

కొత్త ప్రభుత్వం ఏర్పాటై దాదాపు నెల రోజులు కావస్తున్నా ఇంత వరకూ మంత్రివర్గ విస్తరణ జరగలేదు. మంచి రోజులు లేవనే కారణంతో కేబినెట్ విస్తరణను వాయిదా వేసినట్లు టీఆర్ఎస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇఫ్పుడు అసెంబ్లీ సమావేశాల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నందున పరిమిత స్థాయిలో అయినా మంత్రివర్గ విస్తరణ కూడా ఉండొచ్చని ఆశావహులు ధీమాతో ఉన్నారు. అయితే అది ఎప్పుడు అనే తేదీ మాత్రం తేలాల్సి ఉంది. ఎక్కువ మంది ఈ నెల 18న మంత్రవర్గ విస్తరణ ఉండొచ్చని భావిస్తున్నారు. మొత్తానికి కెసీఆర్ ఇద్దరితోనే మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసి నూతన చరిత్ర సృష్టించబోతున్నారు.

Next Story
Share it