Telugu Gateway
Andhra Pradesh

చంద్రబాబు అవినీతిపై వైసీపీ మరో పుస్తకం

చంద్రబాబు అవినీతిపై వైసీపీ మరో పుస్తకం
X

తెలుగుదేశం అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి అవినీతిపై ప్రధాన ప్రతిపక్షం అయిన వైసీపీ మరో పుస్తకాన్ని విడుదల చేసింది. ఈ పుస్తకానికి ‘అవినీతి చక్రవర్తి’ అనే పేరు పెట్టారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇఫ్పటివరకూ 6 లక్షల 17 వేల 585 కోట్ల రూపాయల సొత్తును దోచుకున్నారని ఆరోపించారు. చంద్రబాబు దోపిడీకి సంబంధించి ప్రతి ఆధారాన్ని పుస్తకంలో చూపెట్టామని..ఈ పుస్తకాన్ని దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు..ప్రధాని, రాష్ట్రపతితో సహా అందరికీ పంపనున్నట్లు వైసీపీ నేతలు తెలిపారు. పాదయాత్రలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ఈ పుస్తకాన్ని విడుదల చేశారు.

చంద్రబాబు ఓ అవినీతి చక్రవర్తి అని వైసీపీ నేత తమ్మినేని సీతారాం ఆరోపించారు.

చంద్రబాబుకు దమ్ముంటే ఈ పుస్తకాన్ని ఖండించాలని అన్నారు. దేశంలో అత్యంత సంపన్నమైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడని పలు మీడియా సంస్థలు పేర్కొంటున్న విషయాన్ని ప్రస్తావించారు. ఈ పుస్తకంలోనివి అవాస్తవాలైతే శ్వేత పత్రం విడుదల చేయాలని చంద్రబాబును డిమాండ్‌ చేశారు. చంద్రబాబు ప్రభుత్వంపై ఈ పుస్తకం చార్జీ షీట్‌ అని పేర్కొన్నారు. దీనిపై దేశవ్యాప్తంగా బహిరంగ చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు. పోలవరంలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉందన్నారు. చంద్రబాబు అబద్దాలతో ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.

Next Story
Share it