Telugu Gateway
Andhra Pradesh

మోడీ మిత్రుడికి బాబు భారీ బొనాంజా!

మోడీ మిత్రుడికి బాబు భారీ బొనాంజా!
X

గౌతమ్ అదానీ. దేశంలోనే ప్రముఖ పారిశ్రామికవేత్త. ఆయన భారత ప్రధాని నరేంద్రమోడీకి అత్యంత సన్నిహితుడని రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం. కాంగ్రెస్ పార్టీ అయితే పలుమార్లు ఈ అంశంపై నేరుగానే విమర్శలు చేసింది. మోడీ పనిచేసేది అదానీ..అంబానీల కోసమేనంటూ. నిత్యం ప్రధాని నరేంద్రమోడీతో కయ్యానికి కాలుదువ్వుతున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇప్పుడు అదానీ గ్రూపునకు చెందిన గౌతమ్ అదానీకి భారీ ఎత్తున లబ్ది చేకూర్చిపెట్టడానికి రెడీ అయ్యారు. ఈ మేరకు ఆయన అదానీ గ్రూప్ తో బుధవారం నాడు ఒప్పందాలు కూడా చేసుకున్నారు. ఈ గ్రూప్ సంస్థ ఏర్పాటు చేయబోయే డాటా సెంటర్లతోపాటు...సోలార్ పార్క్ లకు ఏపీ సర్కారు భారీ ఎత్తున రాయితీలు..ప్రోత్సాహకాలు ఇవ్వబోతోంది. మొత్తం ఐదు వందల ఎకరాల్లో ఈ ప్రాజెక్టులు ఏర్పాటు కానున్నాయి.

ఈ ప్రాజెక్టులకు అవసరం అయిన భూమిని విశాఖపట్నంలోని అత్యంత ఖరీదైన కాపులుప్పాడ, నక్కపల్లితోపాటు కొంత మొత్తాన్ని విజయనగరం జిల్లాలో కూడా కేటాయించనున్నారు. అయితే అదానీ సంస్థకు ప్రభుత్వం ఎంత రేటుకు...ఎక్కడెక్కడ భూములు కేటాయిస్తున్నారనే అంశాన్ని మాత్రం వెల్లడించలేదు. ఈ సంస్థకు ఇచ్చే రాయితీలు..ప్రోత్సాహకాలు కూడా భారీ ఎత్తున ఉండబోతున్నాయని అధికార వర్గాలు చెబుతున్నారు. భూమి ధరతోపాటు రాయితీలు కలుపుకుంటే ఇది వందల కోట్లలోనే ఉంటుందని చెబుతున్నారు. ఏపీకి వచ్చే పరిశ్రమలను ప్రధాని నరేంద్రమోడీ అడ్డుకుంటున్నారని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ లు పలుమార్లు బహిరంగంగా ప్రకటించారు.

అలాంటిది ఏపీలో తన మిత్రుడు ఏకంగా 70 వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతానంటే ఓకే అని పంపిస్తారా?. అసలు దీని వెనక కథ ఏముంది?. చంద్రబాబే అదానీ కంపెనీకి అడ్డగోలుగా మేలు చేసి పెట్టి మోడీతో రాజీకి వెళుతున్నారా?. లేక అదానీకి ఓడరేవుతో పాటు అదానీ తలపెట్టే ఈ ప్రాజెక్టుకు ప్రజల సొమ్మును ధారబోసి తన రాజకీయ అవసరాలకు వాడుకోవాలనుకుంటున్నారా?. చట్టబద్దంగా ఏపీకి రావాల్సినవే మోడీ అడ్డుకుంటున్నారని చెబుతున్న చంద్రబాబు అండ్ కో...స్వయంగా మోడీ ఎంత చెపితే అంత వింటారనే ప్రచారంలో ఉన్న అదానీనీ ఏపీకి అంత భారీ పెట్టుబడులు పెట్టడానికి ఎందుకు అనుమతిస్తారు? అని ఓ అధికారి వ్యాఖ్యానించారు. అయితే ఈ డేటా సెంటర్లు ఏర్పాటు పూర్తయితే రాష్ట్రానికి ఎంతో ప్రయోజనం ఉంటుందని..యువతకు ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని అన్నారు.

Next Story
Share it