నామినేషన్ రోజే రేవంత్ థూం థాం
కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి నామినేషన్ రోజే దుమ్మురేపారు. భారీ ఎత్తున వచ్చిన అభిమానులతో ఆయన కొడంగల్ లో నామినేషన్ దాఖలు చేశారు. వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని..కొడంగల్ ప్రతిష్ట రాబోయే రోజుల్లో మరింత పెరగనుందని పేర్కొన్నారు. గత ఎన్నికల సమయంలో నామినేషన్ వేసిన రోజు వచ్చిన వారి కంటే ఇప్పుడు ఎంతో ఎక్కువ మంది తరలివచ్చారని..ఇంత మంది అభిమానుల భావోద్వేగాల మధ్య తాను నామినేషన్ వేస్తానని అనుకోలేదని వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి నామినేషన్ సందర్భంగా పోలీసులు పలు జాగ్రత్తలు తీసుకున్నారు. మహాకూటమిలోని పార్టీలకు చెందిన నేతలు కూడా రేవంత్ రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజలు ఇచ్చిన గుండె ధైర్యంతో తన గళాన్ని విన్పిస్తున్నానని..అయితే సీఎం కెసీఆర్ తన గొంతు నొక్కాలని చూస్తున్నారని ఆరోపించారు.
కొడంగల్ కు కెసీఆర్, కెటీఆర్, హరీష్ రావు ఎవరు వచ్చినా ఎదుర్కొంటానని పేర్కొన్నారు. కొడంగల్ ప్రజలను తాను హైటెన్షన్ వైరులా అండగా ఉంటానని పేర్కొన్నారు. కొడంగల్ ప్రజలు డబ్బుకు లొంగరని..వీరు ఎంత తెలివైన వారో డిసెంబర్ 11న తెలుస్తుందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుపు తనదే అని దీమా వ్యక్తం చేశారు. నామినేషన్ వేయటానికి ముందు కార్యకర్తలతో రేవంత్ రెడ్డి కొద్దిసేపు సమావేశం అయ్యారు.