పెట్రోల్..డీజిల్ పై పన్ను తగ్గించినకేంద్రం
వరస షాక్ ల నుంచి ఊరట. ఏ మాత్రం తగ్గకుండా రోజురో్జుకూ పెరిగిపోతున్న పెట్రోల్, డీజిల్ రేట్లను తగ్గించే దిశగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్ , డీజిల్ పై 2.50 రూపాయల లెక్కన ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. దీంతో ఈ మేర ధరలు తగ్గనున్నాయి. వాస్తవానికి ఐదు రూపాయలు తగ్గించాలని అనుకున్నామని..అయినా ప్రస్తుత పరిస్థితుల్లో ఇది సాధ్యంకాలేదని కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. రాష్ట్రాలు కూడా పన్నులు తగ్గించి ప్రజలపై భారం తగ్గించేందుకు సహకరించాలని జైట్లీ కోరారు. ఎక్సైజ్ డ్యూటీ తగ్గింపుతో, రాష్ట్రాలు సైతం వ్యాట్ను రూ.2.50 తగ్గించాలని అరుణ్జైట్లీ ఆదేశించారు. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు బాగా పెరిగాయని, బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ ధర 86 డాలర్లను దాటిందని మంత్రి అన్నారు.
దీంతో కరెన్సీ మార్కెట్తో పాటు స్టాక్ మార్కెట్పై ప్రభావం పడిందని జైట్లీ అన్నారు. పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలపై ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలను తీసుకుందని, కానీ అంతర్జాతీయ అంశాలు భారత మార్కెట్ను దెబ్బతీస్తున్నాయన్నారు. ఎక్సైజ్ డ్యూటీ తగ్గింపుతో రూ.21,000 కోట్ల రెవెన్యూ నష్టం వాటిల్లనుందని జైట్లీ తెలిపారు. డీజిల్, పెట్రోల్ ధరలను డీరెగ్యులేషన్ చేయాలని తాము భావించడం లేదని జైట్లీ చెప్పారు. అంతర్జాతీయంగా పెట్రోల్, డీజిల్ పెరగడం, దేశీయంగా రూపాయిని కూడా భారీగా కుప్పకూల్చుతుంది. రూపాయి ఎఫెక్ట్, చమురు ధరల సెగ స్టాక్ మార్కెట్లను సైతం అతలాకుతలం చేస్తున్నాయి.