అమరావతి బాండ్స్ పై కేంద్రం నజర్!..చంద్రబాబుకు చిక్కులు
అమరావతి బాండ్స్ వ్యవహారం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మెడకు చుట్టుకోనుందా? అంటే అవుననే ఏపీ చెబుతున్నాయి ఏపీ ప్రభుత్వ వర్గాలు. ఎందుకంటే తాజాగా ఈ అంశానికి సంబంధించి కేంద్ర ఆర్ధిక శాఖ అధికారులు ఏపీ ప్రభుత్వ వర్గాలను ఫోన్ చేసి మాట్లాడారు. అదే సమయంలో ఈ బాండ్లలో పెట్టుబడులు పెట్టిన వారి వివరాలు కూడా పంపాలని ఆదేశించారు. కేంద్రం బీఎస్ఈ నుంచి కూడా ఈ వివరాలు తెప్పించుకుంటోంది. అదే సమయంలో ఏపీ నుంచి కోరుతోంది. అయితే ఈ బాండ్స్ లో పెట్టుబడిపెట్టిన వారు ఎవరెవరు అన్న అంశంపై ఫోకస్ పెట్టింది కేంద్రం కూడా. ఓ బడా సంస్థ పెట్టిన పెట్టుబడిలో 42 శాతం నిధులు ఏకంగా ఏపీ ఐటి శాఖలో అనధికారికంగా చక్రం తిప్పుతున్నవారి ఫ్యామిలీ నుంచే వచ్చాయని కేంద్రానికి ఫిర్యాదులు అందినట్లు సమాచారం. అంటే ఇది ఖచ్చితంగా అవినీతి సొమ్మే అన్న అనుమానం కేంద్ర వర్గాల్లో వ్యక్తం అవుతోంది. అంటే అవినీతి సొమ్మునే అధిక వడ్డీ దక్కించుకునేందుకు మళ్లీ అమరావతి బాండ్లలో పెట్టుబడి పెట్టారని ఆరోపణలు విన్పిస్తున్నాయి.
ఈ మొత్తం వ్యవహారంపై కేంద్రం దర్యాప్తునకు ఆదేశించే అవకాశం ఉందని చెబుతున్నారు. అమరావతి బాండ్ల సక్సెస్ అంతా తన ప్రతిభే అన్న ఏపీ సీఎం ప్రచారం చేసుకున్న విషయం తెలిసిందే. తీరా చూస్తే జారీ చేసిన 2000 కోట్ల రూపాయల బాండ్లలో 1300 కోట్ల రూపాయలను ఏపీ ప్రభుత్వ నుంచి అనుచితంగా లబ్దిపొందిన ఫ్లాంక్లిన్ టెంపుల్టన్ పెట్టుబడులు పెట్టడం విశేషం. ఇందులోనే ఏదో గోల్ మాల్ జరిగిందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వందల కోట్ల రూపాయల విలువ చేసే భూములను ఏపీ ప్రభుత్వం ఈ సంస్థకు కారుచౌకగా కట్టబెట్టింది. ఇదే పెద్ద స్కామ్ అయితే..ఇప్పుడు బాండ్ల వ్యవహారం కూడా ఓ పెద్ద స్కామ్ గా మారబోతుందని చెబుతున్నారు. బాండ్స్ అంశంలో ఏపీ సీఎం చిక్కుల్లో పడటం ఖాయం అని చెబుతున్నారు.