Telugu Gateway
Latest News

కేరళకు ‘చిరు ఫ్యామిలీ’ 61 లక్షల రూపాయల సాయం

కేరళకు ‘చిరు ఫ్యామిలీ’ 61 లక్షల రూపాయల సాయం
X

చరిత్రలో కనీవినీ ఎరుగని కష్టాన్ని ఎదుర్కొంటున్న కేరళను ఆదుకునేందుకు అందరూ ముందుకొస్తున్నారు. టాలీవుడ్ కు చెందిన మెగా ఫ్యామిలీ కూడా అందులో పాలుపంచుకుంటోంది. చిరు ఫ్యామిలీ మొత్తం కలిపి కేరళకు 61 లక్షల రూపాయల సాయం ప్రకటించారు. మెగాస్టార్ చిరంజీవి తన వంతుగా కేరళకు 25 లక్షల రూపాయల సాయం ప్రకటించారు. ఆయన తనయుడు, హీరో రామ్ చరణ్ కూడా మరో 25 లక్షల రూపాయలు, రామ్ చరణ్ భార్య ఉపాసన పది లక్షల రూపాయల సాయం ప్రకటించారు. చిరంజీవి తల్లి అంజనా దేవి కూడా లక్ష రూపాయల సాయం చేయనున్నారు. ఇప్పటికే అల్లు అర్జున్ కేరళ వరద బాధితులను ఆదుకునేందుకు తన వంతుగా 25 లక్షల రూపాయల సాయం ప్రకటించారు.

గీత గోవిందం సినిమాతో హిట్ అందుకున్న విజయ్ దేవరకొండ అందరికంటే ముందు ఐదు లక్షల రూపాయల సాయం ప్రకటించారు. తాజాగా వరదలతో అస్తవ్యస్తమైన కేరళకు రూ. 10 లక్షల విరాళం ఇవ్వనున్నట్టు టాలీవుడ్‌కు చెందిన మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ (మా) ప్రకటించింది. ‘మన భూతల స్వర్గం 80 శాతం మునిగిపోయింది. దీన్ని టీవీలో చూస్తుంటే బాధగా ఉంది. ‘మా’ రూ.10 లక్షలు విరాళం ఇస్తుంది. అలాగే ఆర్టిస్టులు కూడా విరాళాలు ఇవ్వాలని కోరుతున్నా’ అని మా ప్రెసిడెంట్‌ శివాజీ రాజా ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సెలబ్రిటీలతో పాటు సామాన్యులు కూడా పెద్ద ఎత్తున కష్టాల్లో ఉన్న కేరళను ఆదుకునేందుకు సాయం అందజేస్తున్నారు.

Next Story
Share it