Telugu Gateway
Telangana

టాలీవుడ్ టాప్ దర్శకుల ‘పార్టీ’

టాలీవుడ్ టాప్ దర్శకుల ‘పార్టీ’
X

అసలే ఎన్నికల సీజన్. దర్శకుల పార్టీ ఏంటి అనుకుంటున్నారా?. ఎందుకంటే ఈ మధ్య కాలంలో సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి ప్రవేశించే వారి సంఖ్య పెరుగుతూ పోతోంది. అయితే ఇది ఆ పార్టీ కాదు లేండి. టాలీవుడ్ లోని అగ్రదర్శకులు అందరూ ఒక దగ్గరకు చేరుకుని వేడుక చేసుకున్నారు. ఈ పార్టీ ఏర్పాటు చేసింది దర్శకుడు వంశీ పైడిపల్లి. దీనికి హాజరైంది అగ్ర దర్శకులు అయిన రాజమౌళి, కొరటాల శివ, సుకుమార్, క్రిష్, నాగ్ అశ్విన్, హరీష్ శంకర్, అనిల్ రావిపూడి, సందీప్ వంగవీటి తదితరులు ఉన్నారు. పార్టీ చేసుకోవటంతో అందరూ కలసి ఫోటో కూడా దిగారు. అది ఇప్పుడు సోషల్ మీడియాలో హంగామా చేస్తోంది. ఎందుకంటే అందరూ దర్శకుడు ఒకే చోట చేరటం అరుదైన విషయం కదా?. ఈ ఫోటోను ట్విట్టర్ లో షేర్ చేసిన వంశీ ‘అద్భుతమైన వ్యక్తులతో మరిచిపోలేని సాయంత్రం గడిపాను’ అంటూ వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ట్వీట్‌ చేశారు.

రాజమౌళి బాహుబలి తర్వాత ఇంకా కొత్త సినిమా మొదలుపెట్టాల్సి ఉంది. ప్రస్తుతం తారక్, రామ్ చరణలతో తెరకెక్కనున్న మల్టీస్టారర్ కు రంగం సిద్ధం చేస్తున్నారు. సుకుమార్ ఈ మధ్యే రంగస్థలంతో సూపర్ డూపర్ హిట్ అందుకున్నారు. ఇప్పుడు మహేష్ బాబుతో సినిమాకు రెడీ అవుతున్నారు. నాగ్ అశ్విన్ మహానటి సినిమా సూపర్ హిట్ కావటంతో ఒక్కసారిగా టాప్ దర్శకుల జాబితాలో చేరిపోయారు. అంతలా సక్సెస్ అయింది ఈ సినిమా మరి. కొరటాల శివ తాజా చిత్రం ‘భరత్ అనే నేను’ కూడా బాక్సాఫీస్ వద్ద హిట్ కొట్టిన విషయం తెలిసిందే. క్రిష్ ఈ మధ్యే ప్రతిష్టాత్మక ఎన్టీఆర్ జీవితచరిత్ర సినిమాకు దర్శకత్వం బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఇలా తెలుగు సినీ పరిశ్రమలోని అగ్ర దర్శకులు అందరూ ఒక చోట చేరటం అరుదైన సంఘటనగానే చెప్పుకోవచ్చు.

Next Story
Share it