వడ్డీ రేట్లు పెరిగాయ్
నాలుగున్నర సంవత్సరాల్లో తొలిసారి. దేశంలో వడ్డీ రేట్లు పెరిగాయి. ఈ మేరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్ బిఐ) వడ్డీ రేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఆరు శాతంగా ఉన్న రెపో రేటును 6.25 శాతానికి పెంచారు. రివర్స్ రెపో రేటును 5.75 శాతం నుంచి 6 శాతానికి పెంచారు. దీంతో దేశంలో గృహ, వాహనాల వడ్డీ రేట్లు పెరిగే అవకాశం ఉంది. రెపో రేటు అంటే ఆర్ బిఐ దేశంలోని బ్యాంకులకు ఇచ్చే నగదుపై వసూలు చేసే వడ్డీ మొత్తమే రెపో రేటు. రివర్స్ రెపో రేటు అంటే బ్యాంకుల నుంచి ఆర్ బిఐ తీసుకునే మొత్తాలపై వసూలు చేసే మొత్తం అన్న మాట.
రూపాయి క్షీణత, ద్రవ్యోల్బణం పెరుగుతుందనే భయాలు, ముడిచమురు ధరలు ర్యాలీతో ఆర్బీఐ ఎంపీసీ రేటు పెంపుకే మొగ్గు చూపింది. ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ నేతృత్వంలో ఆరుగురు సభ్యుల ఎంపీసీ మూడు రోజుల క్రితమే ఈ పాలసీ సమావేశాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. బుధవారం నాడు ఈ కీలక రేటుపై ఎంపీసీ నిర్ణయం ప్రకటించింది. రేటు పెంపును ఆరుగురు సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించినట్టు సమాచారం. ఈ సారి పాలసీలో రెపో పెంపు పావు శాతం ఉంటుందని ముందస్తుగానే మార్కెట్ విశ్లేషకులు అంచనావేశారు.