Telugu Gateway
Andhra Pradesh

టీడీపీలో ‘టీటీడీ’ కలకలం!

టీడీపీలో ‘టీటీడీ’ కలకలం!
X

కోట్లాది మంది భక్తుల సెంటిమెంట్ తో కూడిన అంశం అయిన తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) విషయంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీసుకుంటున్న నిర్ణయాలు కలకలం రేపుతున్నాయి. ఇది ఎక్కడ తమ మెడకు చుట్టుకుంటుందో అన్న భయం టీడీపీ నేతల్లో వ్యక్తం అవుతోంది. తాజాగా టీటీడీ ప్రధాన అర్చకులు రమణదీక్షితులు చేసిన ఆరోపణలు పెద్ద సంచలనంగా మారాయి. తిరుమలలో నియమ, నిబంధనలను పక్కన పెట్టి ప్రభుత్వం ఇష్టానుసారంగా చేస్తోందని ఆయన ఆరోపించారు. సుప్రబాత సేవ సూర్యోదయం ముందు చేయాల్సి ఉంటే...అర్థరాత్రి జరపాలని అర్చకులపై ఒత్తిడి చేస్తున్నారని ఆయన ఆరోపించారు. రాజకీయ ప్రముఖులు, విఐపీల కోసం స్వామివారికి చేస్తున్న సేవల్లో కోత విధిస్తున్నారని విమర్శించారు. తిరుమల పవిత్రతను కాపాడుకునేందుకు భక్తులే ఉద్యమించాలని ఆయన పిలుపునిచ్చారు. అంతే కాదు..తిరుమల వెంకటేశ్వరస్వామికి శ్రీకృష్ణదేవరాయుల నుంచి మైసూరు మహారాజుల వరకూ ఇఛ్చిన కానుకలు ఎక్కడ ఉన్నాయో తెలియటంలేదని అన్నారు. అధికార పార్టీ ఎమ్మెల్సీ తమ ఊరిలో కళ్యాణ మండపానికి 10 కోట్ల రూపాయలు కోరుతున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. ఆలయ ప్రధాన అర్చకుడు అయిన రమణదీక్షుతులు చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వంపై ఖచ్చితంగా ప్రతికూల ప్రభావం చూపిస్తాయని టీడీపీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

గతంలో ఎన్నడూ లేని రీతిలో చంద్రబాబునాయుడు టీటీడీ విషయంలో ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సంవత్సరాల తరబడి బోర్డు వేయకుండా ఉండటం ఒకెత్తు అయితే..వేసిన బోర్డులోనూ తాను బైబిల్ లేకుండా ఉండనని..ఇప్పటికీ తన బ్యాగ్ లో..కారులో బైబిల్ ఉంటుందని టీటీడీ బోర్డులో చోటు దక్కించుకున్న ఎమ్మెల్యే అనిత ఓ ఇంటర్వూలో చెప్పారు. ఆమెను టీటీడీ బోర్డులో వేయగానే..ఆ వీడియో బయటకు రావటంతో పెద్ద దుమారమే రేగింది. దీంతో ఆమెతో రాజీనామా చేయించి మమ అన్పించారు. అసలు టీటీడీ వంటి ప్రతిష్టాత్మక బోర్డులో సభ్యులను నియమించే ముందే అన్ని విషయాలు పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి. కానీ అలాంటిది వేసిన తర్వాత చంద్రబాబు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ఇక ఛైర్మన్ సుధాకర్ యాదవ్ విషయంలోనూ కావాల్సినన్ని వివాదాలు ఉండనే ఉన్నాయి. టీటీడీ ఈవోగా అనిల్ కుమార్ సింఘాల్ నియామకం కూడా సంప్రదాయాలకు భిన్నంగా జరిగింది. దేవాలయ సంస్కృతి, సంప్రదాయాలు తెలిసిన వ్యక్తులకే ఈవో పదవి ఇచ్చే పద్దతి పాటించేవారు గతంలో. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గత సంప్రదాయాలను తుంగలో తొక్కి ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకుంటున్నారు. టీటీడీ జెఈవో విషయంలోనూ అదే పరిస్థితి. శ్రీనివాసరాజును సంవత్సరాల తరబడి అక్కడే కొనసాగిస్తున్నారు. రమణదీక్షితులు చేసిన విమర్శలు ఖచ్చితంగా భక్తులపై ప్రభావం చూపించే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తం అవుతోంది.

Next Story
Share it