Telugu Gateway
Andhra Pradesh

అందరూ నమ్మే ఆ సర్వేలో ‘టీడీపీకి షాకింగ్ న్యూస్’

అందరూ నమ్మే ఆ సర్వేలో ‘టీడీపీకి షాకింగ్ న్యూస్’
X

ఆయన సర్వేలను అందరూ నమ్ముతారు. గత కొన్ని సంవత్సరాలుగా ఆయన ఏమి చెపితే ఇంచుమించు అదే జరుగుతోంది. అంత నమ్మకం ఆయన సర్వేలంటే తెలుగు ప్రజలకు. ఏపీలో ప్రస్తుతం అధికార పార్టీకి ఎదరుగాలులు వీస్తున్న తరుణం. ఇందుకు కారణాలు అనేకం. అందులో అడుగు ముందుకు పడని అమరావతి రాజధాని ఒకటి. అకస్మాత్తుగా పవన్ కళ్యాణ్ దూరం అయిన పరిస్థితి. కేంద్రంలో బిజెపితో పంచాయతీ. పట్టిసీమను రికార్డు సమయంలో పూర్తి చేశానని చెప్పుకునే చంద్రబాబు కనకదుర్గ ఫ్లైఓవర్ ను ఎందుకు పూర్తి చేయలేకపోయారు?. అంటే అక్కడ డబ్బులు వస్తాయి...ఇక్కడి వచ్చేది ఏమీ ఉండదు కాబట్టి వదిలేశారు?. నిజంగా చంద్రబాబు నిర్మాణాల్లో ‘నిపుణుడు’ అయితే నాలుగేళ్ళుగా ప్రజలు ఎంతో కష్టపడుతున్నా..ఫ్లైఓవర్ ను ఎందుకు వదిలేసినట్లు. రాజధాని ప్రాంతానికి ఎంతో కీలకం అయిన ఈ ప్లైఓవర్ ప్రాధాన్యత లేనిదా?. పోలవరం సోమవారం, అమరావతి బుధవారం అన్నట్లు దీనికి కూడా ఓ వారం కేటాయించవచ్చుకదా?. అంటే అక్కడ ‘లెక్కలు’ వేరు. దీని లెక్కలు వేరు. అందుకే ఇది లైట్ తీసుకున్నారు. ప్రజల కష్టాలు ముఖ్యం కాదు..మనకు వచ్చే లాభాలు ముఖ్యం. ఇదీ చంద్రబాబు వరస. కట్టిన తాత్కాలిక అసెంబ్లీ, సచివాలయాలు కూడా నాసిరకాలే. ఈ విషయం ఎన్నో సార్లు బహిరంగంగానే నిరూపితమైంది. ఇన్ని ప్రతికూలతల మధ్య ఏపీలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా మారిన తరుణంలో వాస్తవ పరిస్థితి తెలుసుకునేందుకు అధికార పార్టీ ఓ సర్వే చేయించుకుంది అందరూ నమ్మే ఆయనతో.

ఆ సర్వే ఇప్పటికే 70 శాతం పూర్తి అయింది. పూర్తయిన 70 శాతంలో అరవై శాతానికి పైగా అధికార టీడీపీకి వ్యతిరేక ఫలితాలు రావటంతో విస్తుపోవటం పార్టీ పెద్దల వంతు అయింది. ఈ నివేదికతో కొంత మంది పెద్దలు ఓ పత్రికాధిపతితో కూడా మాట్లాడి...నష్ట నివారణకు చేపట్టాల్సిన చర్యలపై ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు టీడీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఎన్నికలకు ఇంకా నిండా ఏడాది కూడా లేని సమయంలో సర్వేలో వెల్లడైన అంశాలు అధికార పార్టీని చికాకు పెట్టేలా ఉండటం విశేషం. కష్టాల్లో ఉన్న ఏపీని చంద్రబాబు ఎంతో కష్టపడి ముందుకు తీసుకెళుతున్నాడని టీడీపీ నేతలు..అనుకూల మీడియా విస్తృత ప్రచారం చేస్తున్నా చాలా వరకూ ప్రజలు వీటిని నమ్మటం లేదనే విషయం సర్వేలో వెల్లడైంది. ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు పలుమార్లు మాట మార్చిన అంశంపై కూడా టీడీపీపై వ్యతిరేకత పెరగటానికి కారణం అయింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఫీల్డ్ లో దిగి పొలిటికల్ ‘ఫైటింగ్’ ప్రారంభించటంతో రాబోయే రోజుల్లో సీన్ మరింత మారే అవకాశం ఉందని టెన్షన్ టీడీపీ నేతల్లో ఉంది. ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి చేసే విమర్శల కంటే పవన్ చేసే విమర్శలు వేగంగా ప్రజల్లోకి వెళ్ళే అవకాశం ఉందని టీడీపీ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి.

Next Story
Share it