Telugu Gateway
Andhra Pradesh

చంద్రబాబు ‘అసలు ప్లాన్ అదే’!

చంద్రబాబు ‘అసలు ప్లాన్ అదే’!
X

ఎన్నికల్లో గెలుపుకు సొంత బలంతో పాటు ‘వ్యూహాలు’ కీలకం. టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వీటిని బాగా నమ్ముకుంటారు. సొంత బలం కంటే ఎప్పటికప్పుడు ఆయనకు ఓ ‘వీక్ పాయింట్’ కావాలి. ఆ వీక్ పాయింట్ పైనే టార్గెట్ చేసి..సహజంగా ఉండే తన అర్థ, అంగ బలాలు ప్రయోగించి ఎన్నికల్లో గెలిచేందుకు ప్లాన్ చేసుకుంటారు. ఇప్పుడు కూడా అదే దిశగా చంద్రబాబు ప్రయత్నాలు సాగుతున్నాయి. అందుకే మహానాడు వేదికగా ‘మోడీ, అమిత్ షా’లను టార్గెట్ చేయటం ద్వారా ఇఫ్పటికే ప్రజల్లో ఉన్న బిజెపి వ్యతిరేకతను మరింత పెంచే ప్రయత్నం చేస్తున్నారు. అంతే కాదు..జగన్, పవన్ బిజెపి మనుషులే అని చెప్పటం ద్వారా వచ్చే ఎన్నికల్లోనూ లబ్దిపొందేందుకు పక్కా ప్లాన్ వేసుకున్నారు. అందుకే అటు చంద్రబాబు, ఇటు లోకేష్ లు తమ ప్రధాన ప్రత్యర్థి, రాజకీయ శత్రువు బిజెపినే అని ప్రకటించారు. అంటే గత ఎన్నికల్లో ఉన్న ప్రధాన శత్రువు కాంగ్రెస్ ఇప్పుడు ‘మిత్రుడు’గా మారినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. చంద్రబాబుకు ఎప్పటికప్పుడు మిత్రులు..శత్రువులు మారిపోతుంటారు. ఎందుకంటే రాజకీయ అవసరాలు ముఖ్యం కదా?.

వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు ప్రధాన ఏజెండా చేసిన పనులు చెప్పుకోవటం కంటే ‘బిజెపి మోసం చేసింది. నేను అమాయకుడిని. మోసపోయాను. మొదటి నుంచి నేను ప్రత్యేక హోదానే అడిగాను. మోడీ ఇవ్వలేదు’ అని ప్రచారం చేస్తారు. ఓ వైపు ప్రధాని మోడీ వీడియోలు వేసి పదే పదే చంద్రబాబు బిజెపిపై వ్యతిరేకత పెంచే ప్రయత్నం చేస్తున్నారు. మరి అదే చంద్రబాబు అసెంబ్లీలోపల, అసెంబ్లీ బయటా అసలు ప్రత్యేక హోదాతో ఏమీ రాదు. హోదా పొందిన రాష్ట్రాలు ఏమి సాధించాయి. ప్యాకేజీనే సూపర్ అన్న వీడియోలు వేసి చూపించటం బిజెపి నేతల వల్ల కావటం లేదు. ఎప్పటికి ఏది దొరికితే దాన్ని విజయవంతంగా వాడుకోవటంలో చంద్రబాబు దిట్ట. గత ఎన్నికల్లోనూ ఆయనకు అదే కలిసొచ్చింది. రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ పై వ్యతిరేకత ఏపీలో పీక్ స్టేజ్ లో ఉంది. అప్పట్లో కాంగ్రెస్ అధికారంలో ఉండటంతో రాష్ట్ర విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చిన చంద్రబాబు కూడా సమన్యాయం చేయలేదనే నెపంతో కాంగ్రెస్ పై వ్యతిరేకతను క్యాష్ చేసుకున్నారు. దీనికి తోడు జగన్ తో పోలిస్తే చంద్రబాబుకు అనుభవం ఉంది కదా...రాజధాని కడతారులే అని ప్రజలు నమ్మారు.

ఇప్పుడు ప్రత్యేక హోదా ఇవ్వలేదనే కారణంతో బిజెపిని టార్గెట్ చేశారు. గత ఎన్నికల్లో చంద్రబాబు టార్గెట్ కాంగ్రెస్. ఈ సారి బిజెపి. రాజధాని నిర్మాణంలో తన వైఫల్యాలను కూడా బిజెపి ఖాతాలో వేసి ముందుకు సాగేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. మరి చంద్రబాబు ప్లాన్ ఈ సారి ఏ మేరకు ఫలిస్తాయో వేచిచూడాల్సిందే. గత ఎన్నికల్లో కలిసొచ్చిన అంశాలు ఏవీ చంద్రబాబుకు ప్రస్తుతం లేవు. గత ఎన్నికల్లో తోడుగా ఉన్న జనసేన, బిజెపి లేవు. ఇప్పటికే రాజకీయంగా చంద్రబాబు ఏపీలో ఒంటరి అయ్యారు. 2014 ఎన్నికల్లో అన్ని సానుకూలతలు ఉన్నా....టీడీపీ, వైసీపీల మధ్య ఓట్ల తేడా చాలా స్వల్పమే. బిజెపికి దగ్గరయ్యే అనే ప్రచారం తప్ప..జగన్ పై వ్యతిరేకత పెరగటానికి అతను ఏమీ అధికారంలో లేడు. మరి చంద్రబాబు ప్రచారాన్ని ప్రజలు నమ్ముతారా?. చంద్రబాబు కొత్త ప్లాన్ వర్కవుట్ అవుతుందా? 2019 వరకూ వేచిచూడాల్సిందే.

Next Story
Share it