ఫెడరల్ ఫ్రంట్ కసరత్తు..బెంగుళూరుకు కెసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ మళ్లీ ఫెడరల్ ఫ్రంట్ పని మళ్లీ ప్రారంభించారు. అందులో భాగంగా ఆయన శుక్రవారం నాడు బెంగుళూరు వెళ్ళనున్నారు. ప్రస్తుత రాజకీయాలపై మాజీ ప్రధాని దేవెగౌడతో చర్చించిన తర్వాత అదే రోజు సాయంత్రం సీఎం హైదరాబాద్ చేరుకుంటారు. రాజకీయ వేదిక ఏర్పాటు ప్రక్రియ దిశగా ఇటీవలే కోల్కతాలో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీతో భేటీ అయ్యారు. అనంతరం జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి, జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం) నేత హేమంత్ సోరేన్ హైదరాబాద్ వచ్చి కేసీఆర్ సమావేశమయ్యారు. ఇపుడు కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో కేసీఆర్, దేవెగౌడల భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.
గత కొన్ని రోజులుగా కెసీఆర్ దేశానికి కాంగ్రెస్, బిజెపిలు చేసింది ఏమీలేదు...దేశంలో సమూల మార్పులు రావాలంటే కొత్త ఫ్రంట్ కీలక పాత్ర పోషించాల్సిందే అని కెసీఆర్ చెబుతున్నారు. ప్రస్తుతం ఆయన ఈప్రయత్నాల్లో ఉన్నారు. అయితే కెసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ పై కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది. ఇది కేవలం బిజెపికి సహకరించేందుకు చేస్తున్న పనే అని ఆ పార్టీ ఆరోపిస్తోంది. వాస్తవానికి బెంగుళూరు పర్యటన కంటే ముందు కెసీఆర్ ఒరిస్సా వెళతారని ప్రచారం జరిగింది. కానీ కారణాలేమిటో కానీ ఈ పర్యటన వాయిదా పడింది.