అవినీతిలో అగ్రస్థానం రైల్వే..బ్యాంకింగ్ రంగాలదే
దేశంలోనే అత్యంత అవినీతిమయం అయిన శాఖ ఏదో తెలుసా?. రైల్వేలు అట. దాని తర్వాత స్థానం బ్యాంకులదే. ఈ మధ్య కాలంలో బ్యాంకింగ్ స్కామ్ లు రోజుకొకటి వెలుగులోకి వస్తున్నవిషయం తెలిసిందే. తాజాగా సీవీసీ వెల్లడించిన నివేదిక ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. గత ఏడాది వచ్చిన ఫిర్యాదులకు సంబంధించిన నివేదికను సీవీసీ పార్లమెంట్కు సమర్పించింది. ఉద్యోగుల అవినీతిపై వచ్చిన ఫిర్యాదుల్లో రైల్వేలు, ప్రభుత్వ బ్యాంకులు టాప్ లో ఉన్నాయని తెలిపింది.
2017 సంవత్సరానికి గానూ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్(సీవీసీ) ఈ సంచలన విషయాలను పార్లమెంటుకు నివేదించింది. అవినీతి నిరోధక విభాగానికి వచ్చిన ఫిర్యాదులను పరిశీలించిన అనంతరం సీవీసీ ఈ రిపోర్టును వెల్లడించింది. ఈ ఏడాది రైల్వే ఉద్యోగులపై 12,089, బ్యాకింగ్ ఉద్యోగులపై 8,018 ఫిర్యాదులు వచ్చినట్టు సీవీసీ నివేదికలో పేర్కొంది. దేశ రాజధాని ఢిల్లీలో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగుల మీద ఫిర్యాదులు గణనీయంగా పెరిగినట్టు చెప్పింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్కు చెందిన ఉద్యోగులపై 2,730 ఫిర్యాదులు నమోదు అయ్యాయి.