జగన్ పాదయాత్ర@1500
వైసీపి అధినేత, ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర బుధవారం నాడు కొత్త మైలురాయిని దాటింది. గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గంలో జగన్ పాదయాత్ర 1500 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని జగన్ ములుకుదురులో ఓ మొక్కను నాటారు. వైఎస్ జగన్ 2017 నవంబర్ 6న వైఎస్ఆర్ జిల్లా ఇడుపులపాయలో ప్రజాసంకల్పయాత్రను ప్రారంభించిన విషయం తెలిసిందే. 180 రోజులపాటు 125 నియోజకవర్గాల్లో 3వేల కిలోమీటర్ల మేర ఈ పాదయాత్ర సాగనుంది. ఇప్పటి వరకు వైఎస్ఆర్ జిల్లా, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో పాదయాత్ర పూర్తి కాగా ఈ నెల 12న గుంటూరు జిల్లాలోని ప్రవేశించింది.
ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వైసీపీ అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించిన సంగతి తెలిసిందే. పాదయాత్ర సందర్భంగా జగన్ ఏపీ సీఎం చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. ప్రధానంగా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయటంలో చంద్రబాబు ఘోరంగా విఫలమయ్యారని ఆరోపిస్తున్నారు.