Telugu Gateway
Andhra Pradesh

టాలీవుడ్ హీరోలు హీరోయిన్ల వెంట పడటానికే...

టాలీవుడ్ హీరోలు హీరోయిన్ల వెంట పడటానికే...
X

తెలుగుదేశం పార్టీ టాలీవుడ్ నటులపై తీవ్ర విమర్శలు చేసింది. మీరు ఇలా ఉంటే...తెలుగు సినీ పరిశ్రమను బాయ్ కాట్ చేయాల్సి వస్తుందని హెచ్చరించింది. అవార్డులు ఇవ్వకపోతే లొల్లి చేసే కళాకారులు ఇఫ్పుడు ఎందుకు నోరు తెరవరు. మీరు హాలీవుడ్ స్థాయి నటులు కాదు. హీరోయిన్ వెంటబడే క్యారెక్టర్లకే పనికొస్తారు. ఏపీకి అత్యంత కీలకమైన హోదా కోసం కలసి రాకుంటే రాష్ట్ర వ్యాప్తంగా సినిమా ప్రదర్శనలను అడ్డుకుంటామని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ బాబూ రాజేంద్రప్రసాద్ హెచ్చరించారు. పక్క రాష్ట్రం తెలంగాణకు సంబంధించిన సీఎం కెసీఆర్ కుటుంబం అంతా ఏపీకి మద్దతు పలికిందని..అయినా కూడా సినీ పరిశ్రమ నుంచి మాత్రం స్పందన లేదన్నారు. ఏజ్ బార్ అయిన నటులూ మీకు రాష్ట్ర ప్రయోజనాలు పట్టవా? అని ప్రశ్నించారు.

మీకు ఎంతసేపూ ఆస్తులు..ఆదాయాలు, కలెక్షన్లు తప్ప మరేమీ అవసరం లేదా? అన్నారు. ప్రత్యేక హోదాపై ఎందుకు మాట్లాడరు? అని నిలదీశారు. తమిళనాడులో జల్లికట్టు ఉద్యమాన్ని అక్కడి పరిశ్రమ ముందుండి నడిపించింది. ప్రముఖ హీరోలతో పాటు అక్కడ అందరూ పాల్గొన్నారు. తెలుగు చిత్రపరిశ్రమకు చావ చచ్చిపోయిందా? సినీ ప్రముఖులకు ఏమైంది అని ప్రశ్నించారు. తమిళ నటీనటులను చూసి అయినా తెలుగు చిత్రసీమ బుద్ది తెచ్చుకోవాలి. ఆంధ్రా గడ్డపైన పుట్టిన ఏ ఒక్క హీరో అయినా ఈ గడ్డ మీదకి వచ్చారా..? డైరెక్టర్లు హీరోయిన్‌ బొడ్డు, జగణాల గురించి వర్ణించడానికి తప్ప దేనికి పనికి రారు’ అని ఆయన తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు.

ఈ తెలుగు సీనీ పరిశ్రమకు ఏమైంది. ఏ మాయరోగం దాపురించింది. కనకవర్షం మత్తులో మీరు మునిగిపోయారా? ఆ మత్తులో నుంచి బయటికి రారా?. సినీ పరిశ్రమకు చెందిన ఆంధ్రా కళాకారులు..రాష్ట్ర ప్రజల తరపున ఎందుకు మాట్లాడటం లేదు. ఏసీ రూముల్లో కులుకుతూ కూర్చుంటారా?. ఇప్పటికైనా మీరు గళం విప్పండి. ఒక్కరంటే ఒక్క హీరో రాష్ట్రం విడిపోయి నాలుగు సంవత్సరాలైనా అమరావతి వచ్చారా?. ఒక్క రాత్రి అయినా ఇక్కడ నిద్రపోయారా?. మీ స్టూడియోలు..ఆస్తులు తెచ్చి మాకేమి పెట్టమనటం లేదు. సామాజిక స్పృహ, బాధ్యత మర్చిపోతే ఆంధ్రా ప్రజలు సహించరు అని హెచ్చరించారు. మీరు తెలంగాణలో ఉండి..అక్కడే బానిస బతుకులు బతుకుతున్నారు. ఆంధ్రాకు మద్దతు పలికితే మీ ఆస్తులు లాక్కుని మిమ్మల్ని తరిమి తరిమి కొడతారనే భయం ఎందుకు అని ప్రశ్నించారు.

Next Story
Share it