బ్యాంకు లోన్..పాస్ పోర్ట్
చేతులు కాలాక ఆకులు పట్టుకోవటం అంటే ఇదే. దేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్తలు కొంత మంది బ్యాంకులను వేల కోట్లకు ముంచేసి ఎంచక్కా విదేశాలకు ఎగిరిపోతుండటంతో సర్కారు ఈ విషయంపై దృష్టి పెట్టింది. అందులో భాగంగా ఏభై కోట్ల రూపాయల పైబడిన రుణం తీసుకునే వారు అందరూ తమ పాస్ట్ పోర్ట్ వివరాలను విధిగా బ్యాంకులకు అందేచేయాలనే నిబంధన పెట్టారు. విజయ్ మాల్యా, నీరవ్ మోడీ చోక్సీలు సర్కారుకు ఇఛ్చిన ఝలక్ ప్రభుత్వ ప్రతిష్టను మంట కలిపిన విషయం తెలిసిందే. పాస్పోర్ట్ వివరాలతో సరైన సమయంలో బ్యాంకులు చర్యలు తీసుకోవడానికి వీలవుతుందని, దేశం విడిచి పారిపోకుండా సంబంధిత అథారిటీలకు వారి గురించి వెంటనే సమాచారం అందించడం కుదురుతుందని పేర్కొన్నారు. ''స్వచ్ఛమైన, బాధ్యతాయుతమైన బ్యాంకింగ్ను అందించడమే తర్వాతి చర్య.
రూ.50 కోట్లకు పైబడి రుణం తీసుకునే వారి పాస్పోర్ట్ వివరాలు తప్పనిసరిగా సేకరించాలి. మోసం జరిగిన సమయంలో వెంటనే చర్యలు తీసుకోవడానికి వీలవుతుంది'' అని ఫైనాన్సియల్ సర్వీసెస్ సెక్రటరీ రాజీవ్ కుమార్ వెల్లడించారు. అదేవిధంగా ఇప్పటికే రూ.50 కోట్లకు పైబడి రుణం కలిగిన వారి పాస్పోర్ట్ వివరాలను బ్యాంకులు 45 రోజుల్లోగా సేకరించాలని కూడా ఆదేశాలు జారీచేశారు. పీఎన్బీలో దాదాపు రూ.12,700 కోట్ల కుంభకోణానికి పాల్పడిన నీరవ్ మోదీ, మెహుల్ చౌక్సిలు, లా ఎన్ఫోర్స్ మెంట్ ఏజెన్సీల విచారణకు కూడా సహకరించడం లేదు. ఈ క్రమంలో రూ.50 కోట్లకు పైబడి రుణం కలిగిన వారి పాస్పోర్ట్ వివరాలను బ్యాంకులు సేకరించాలని ఆర్థికమంత్రిత్వ శాఖ అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులను ఆదేశించింది.