Telugu Gateway
Politics

ఏపీ కోటా రాజ్యసభ సీటు కోసం తెలంగాణ నేతల ఒత్తిళ్ళు!

ఏపీ కోటా రాజ్యసభ సీటు కోసం తెలంగాణ నేతల ఒత్తిళ్ళు!
X

తెలంగాణ తెలుగుదేశం పరిస్థితి నానాటికీ తీసికట్టుగా తయారవుతోంది. ఇప్పటికే చాలా మంది నేతలు ఇతర పార్టీల్లోకి జంప్ చేయగా..మిగిలిన వారు కూడా అదే పనిలో ఉన్నారు. ఎక్కడ తమకు సీటు గ్యారంటీ లభిస్తుందా? అనే లెక్కల్లో మునిగితేలుతున్నారు. తాజా ఫిరాయింపుల స్పీడ్ చూస్తుంటే ఎన్నికల నాటికి పార్టీలో లీడర్లు మిగలటం కష్టమనే అభిప్రాయం విన్పిస్తోంది. ఈ తరుణంలో వచ్చిన రాజ్యసభ ఎన్నికల్లో తమకు ప్రాతినిధ్యం కల్పించాలని కొంత మంది తెలంగాణ నేతలు కోరుతున్నారు. మాజీ రాజ్యసభ సభ్యుడు రావుల చంద్రశేఖర్ రెడ్డి తనకు అవకాశం కల్పించాలని ఒత్తిడి చేస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. గతంలో పార్టీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు కూడా ఇదే తరహాలో డిమాండ్ చేస్తే..ఆయనకు గవర్నర్ ఆశ చూపించారు. అది కూడా అమలుకు నోచుకోలేదు. తాజాగా టీ టీడీపీని టీఆర్ఎస్ లో విలీనం చేయాలనే వివాదస్పద వ్యాఖ్యలతో మోత్కుపల్లి పార్టీ నేతల ఆగ్రహానికి గురయ్యారు. దీంతో రావుల తన ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు చెబుతున్నారు.

ఏపీకి చెందిన నేతలే రాజ్యసభ రేసులో చాలా మంది ఉండగా...మరి తెలంగాణకు వారికి చంద్రబాబు అవకాశం కల్పిస్తారా? లేదా అన్నది ఇప్పుడు పార్టీ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. ఏప్రిల్ లో పదవి విరమణ చేయనున్న సీఎం రమేష్ ఎలాగైనా తన సీటు రెన్యువల్ చేయించుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. అయితే ఆయనకు చంద్రబాబు ఇప్పటికే రెన్యువల్ ఉండదని స్పష్టం చేసినట్లు సమాచారం. అయినా పట్టువిడడవని సీఎం రమేష్ వివిధ మార్గాల ద్వారా అధినేతపై ఒత్తిడి తెస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. టీడీపీ నాయకురాలు పంచుమర్తి అనురాధ కూడా ఈ సారి ఎలాగైనా రాజ్యసభ సీటు దక్కించుకోవాలనే లక్ష్యంతో పావులు కదుపుతున్నారు. ఏపీకి మొత్తం మూడు రాజ్యసభ స్థానాలు దక్కనుండగా..అందులో అధికార టీడీపీకి రెండు, ప్రతిపక్ష వైసీపీకి ఒక సీటు దక్కనున్నాయి.

అయితే ఉన్న రెండు సీట్లకు సంబంధించి పోటీ టీడీపీలో తీవ్రంగా ఉంది. సీనియర్ నేత, ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు కూడా రాష్ట్ర రాజకీయాలకు గుడ్ బై చెప్పి రాజ్యసభ వెళ్ళాలనే యోచనలో ఉన్నారు. అయితే చంద్రబాబు మాత్రం ఆయన ప్రయత్నాలకు బ్రేక్ లు వేస్తున్నారు. ప్రస్తుతం ఏపీలో రాజకీయం హాట్ హాట్ గా ఉండటంతో చాలా మంది నేతలు ధైర్యం చేసి చంద్రబాబును కలసి సీటు అడిగే సాహసం చేయలేకపోతున్నారని చెబుతున్నారు. దీంతో ఎప్పటిలాగానే ఓ సీటు పారిశ్రామిక ప్రముఖులకు కేటాయించి..మరో సీటును పార్టీ నేతలకు కేటాయించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.

Next Story
Share it