టాలీవుడ్ హీరోపై దొంగతనం కేసు
హీరో దొంగగా మారాడా?. అంటే అవునంటోంది ఆయన భార్య. అంతే కాదు ఏకంగా పోలీసు కేసు కూడా పెట్టేసింది. దీంతో పోలీసులు అతగాడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ ఘటన టాలీవుడ్ లో ఒకింత కలకలం రేపింది. భార్య ఫిర్యాదు మేరకు టాలీవుడ్ యువ హీరో సామ్రాట్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదుచేశారు. అతని భార్య హర్షితా రెడ్డి ఫిర్యాదు మేరకు ఈ చర్యలు తీసుకున్నట్లు మాదాపూర్ పోలీసులు చెబుతున్నారు. సామ్రాట్ గత కొంతకాలంగా భార్యను వేధిస్తున్నాడని, ఇప్పటికే అతనిపై గృహహింస, వరకట్నం వేధింపుల కేసులున్నాయని, తాజాగా భార్య ఇంట్లో దొంగతనానికి యత్నించాడని పోలీసులు తెలిపారు. సామ్రాట్, హర్షితలకు రెండేళ్ల కిందట పెళ్లైంది. కలహాల కారణంగా వారిద్దరూ ఇప్పుడు విడివిడిగా ఉంటున్నారు.
గతంలో సామ్రాట్పై రాజేంద్రనగర్ పోలీస్స్టేషన్లో 498/ఏ చట్టం కింద కేసు నమోదయింది. ఇంట్లో ఎవరూలేని సమయంలో సామ్రాట్ లోపలికి ప్రవేశించి, సీసీటీవీ కెమెరాలను ధ్వంసం చేశాడని, ఆభరణాలు, విలువైన వస్తువులు ఎత్తుకెళ్లాడని భార్య హర్షితారెడ్డి సోమవారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. భార్య ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్న పోలీసులు నిందితుడు సామ్రాట్ను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. సామ్రాట్రెడ్డి.. ప్రముఖ మోడల్ శిల్పారెడ్డి సోదరుడన్న సంగతి తెలిసిందే. అనుష్క భర్తగా ‘పంచాక్షరి’ సినిమాలో నటించిన సామ్రాట్.. తకిట తకిట, బావా, దేనికైనా రెడీ లాంటి సినిమాల్లోనూ కనిపిస్తారు.