Telugu Gateway
Politics

‘తెలంగాణలోనూ ‘పవన్’ది ఫ్రెండ్లీ మ్యాచేనా?

‘తెలంగాణలోనూ ‘పవన్’ది ఫ్రెండ్లీ మ్యాచేనా?
X

పార్టీ పెట్టినప్పుడు ప్రభుత్వాల తప్పులను ప్రశ్నించటానికే అన్నారు. కానీ వాస్తవంలో మాత్రం అందుకు భిన్నంగా ముందుకు సాగుతున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ప్రభుత్వాల తప్పులను ప్రశ్నించటం మర్చి...చాలా విషయాల్లో ప్రభుత్వాలను ‘ప్రశంసించటం’లో మునిగితేలుతున్నారు. తాజాగా తెలంగాణ సర్కారు విషయంలోనూ అదే చేశారు. రైతులకు 24 గంటల విద్యుత్ ఇవ్వాలన్న తెలంగాణ సర్కారు నిర్ణయంపై పవన్ కళ్యాణ్ స్వయంగా ప్రగతిభవన్ కు వెళ్లి మరీ సీఎం కెసీఆర్ పై పొగడ్తల వర్షం కురిపించి మరీ వచ్చారు. ఇక ఏపీ విషయానికి వస్తే పవన్ చేసిన ఫీట్లు ఎన్నో. సోమవారం నుంచి పవన్ కళ్యాణ్ తెలంగాణలో పర్యటన ప్రారంభించబోతున్నారు. దీంతో తెలంగాణ రాజకీయం ‘హాట్ హాట్ ’మారటం ఖాయంగా కన్పిస్తోంది. ఒకప్పుడు తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన కోదండరాం సభలకు ఎక్కడికి అక్కడే అడ్డంకులు కల్పించిన కెసీఆర్ సర్కారు...పవన్ కళ్యాణ్ తెలంగాణ టూర్ కు మాత్రం రూట్ క్లియర్ చేసి పెట్టేసింది.

ఒకప్పుడు వరంగల్ సభలో కెసీఆర్ తాట తీస్తాం అని పవన్ కళ్యాణ్ తీవ్ర వ్యాఖ్యలు చేస్తే..తర్వాత కెసీఆర్ కూడా వాడెవడో సినిమా హీరో అట...వరంగల్ గడ్డపై నుంచి నా తీట తీస్తా అంటడా...ఒక చిటికెస్తే చాలు వెయ్యి తునకలు అవుతడు అని హెచ్చరించారు. అటు కెసీఆర్..ఇటు పవన్ ఇద్దరూ ఇప్పుడు ఆ విషయాలను మర్చిపోయి స్నేహగీతం పాడుతున్నారు. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ తెలంగాణ టూర్ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి కీలక అంశాలపై స్పష్టత ఇవ్వటం ఖాయంగా కన్పిస్తోంది. ఏపీలో చేసిన తరహాలోనే తెలంగాణలోనూ ప్రభుత్వ తప్పిదాలను కాకుండా..ప్రతిపక్షాలపై విమర్శలు చేస్తారా?..పవన్ తీరు ఎలా ఉండబోతున్నది అన్నది అంశం ఆసక్తికర అంశంగా మారనుంది. పవన్ పర్యటనకు సంబంధించి ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ ముందుగానే ఎటాక్ ప్రారంభించింది. తెలంగాణ ఉద్యమ సమయంలో పవన్ కల్యాణ్ మాట్లాడిన మాటలు ఉపసంహరించుకున్న తర్వాతే కొండగట్టులో అడుగుపెట్టాలని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు.

మేడారం జాతర సందర్భంగా కొండగట్టుకు రద్దీ పెరిగిన నేపథ్యంలో పవన్ పర్యటనకి ఎలా పర్మిషన్ ఇచ్చారని ఆయన ప్రశ్నించారు.. సీఎం కేసీఆర్ కి పవన్ కి మధ్య జరిగిన చీకటి ఒప్పందం ఏంటని ప్రశ్నించారు. పవన్‌ మొక్కు తీర్చుకోవడానికి వస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని పొన్నం పేర్కొన్నారు. రాజకీయ మనుగడ కోసం వస్తే ఊరుకోమన్నారు. ప్రొ. కోదండరాం పర్యటనకు పర్మిషన్ ఇవ్వరు, పవన్ పర్యటన చేస్తానంటే ఎలా పర్మిషన్‌ ఇస్తారని పొన్నం ప్రభాకర్ నిప్పులు చెరిగారు. నేరెళ్ల బాధితుల గురించి, తెలంగాణాలో రైతుల ఆత్మహత్యల గురించి మాట్లాడని పవన్‌ తెలంగాణలో ఎలా అడుగుపెడతాడంటూ పొన్నం ప్రశ్నించారు. ఇప్పుడు పవన్ టూర్ పై పొన్నం ప్రభాకర్ ఒక్కరే స్పందించారు. ఆయన పర్యటన స్టార్ట్ అయి క్లారిటీ వచ్చిన తర్వాత ఈ వ్యవహారం ఎన్ని మలుపులు తిరుగుతుందో వేచిచూడాల్సిందే.

Next Story
Share it