అది జనసేన కాదు..భజన సేన
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై కాంగ్రెస్ మండిపడింది. అది జనసేన కాదు..భజనసేన అని మండిపడింది. అంతా బాగుంటే తెలంగాణలో తిరిగి ఏమి చేస్తావని పవన్ ను ఆ పార్టీ నేతలు ప్రశ్నించారు. ఇలా భజన చేసే బదులు టీఆర్ఎస్ లో జనసేనను విలీనం చేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు. కేసీఆర్కు భజన చేసేందుకే పవన్ కల్యాణ్ తెలంగాణలో పర్యటిస్తున్నారని విమర్శించారు. ఒకవైపు ఉద్యమకారులను అక్రమంగా అరెస్టు చేస్తున్న ప్రభుత్వం.. పవన్ లాంటివాళ్లను పల్లకీల్లో తిప్పుతున్నదని ఆరోపించారు. కాంగ్రెస్ శాసనసభా పక్ష ఉపనేత జీవన్రెడ్డి, మాజీ ఎంపీ వి.హనుమంతరావులు మంగళవారం గాంధీభవన్లో మీడియాతో మాట్లాడారు. ‘‘తెలంగాణ అమరవీరుల కుటుంబాలను పరామర్శిస్తామంటే ప్రభుత్వం అనుమతించదు. ఎస్సీ వర్గీకరణ విషయంలో మంద కృష్ణ దీక్షను అంగీకరించరు. అదే అజ్ఞాతవాసి సినిమాకు మాత్రం ఐదు షోలకు పర్మిషన్లు ఇస్తారు. అందుకు కృతజ్ఞతగా పవన్ టీఆర్ఎస్కు భజన చేస్తారు.
అసలు ఏం తెలుసని మాట్లాడుతున్నారు? తెలంగాణను అప్పుల ఊబిలోకి నెట్టడంలో కేసీఆర్ పాత్ర ఎంటో తెలుసా? ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కేటాయించినవాటిలో ఎన్ని నిధులు ఖర్చుచేశారో ఎరుకేనా? పవన్ జనసేనను మర్చిపోయి టీఆర్ఎస్ భజనసేనలా తయారయ్యారు’’ అని సీఎల్పీ ఉపనేత జీవన్ రెడ్డి ధ్వజమెత్తారు. పవన్ను ఉద్దేశించి సీనియర్ కాంగ్రెస్ నేత వీహెచ్ మాట్లాడుతూ..‘‘ఒకప్పుడు కేసీఆర్ తాటతీస్తానన్న పవన్.. ఇప్పుడేమో అలాంటి మనిషేలేరని కీర్తిస్తున్నారు. పవన్ చెబుతున్నట్లే ప్రజలు సంతోషంగా ఉంటే, పరిపాలన అంతబాగుంటే ఇక కష్టపడి తిరగడం ఎందుకు? ప్రశ్నిస్తానని చెప్పుకునే పవన్.. ముందు కత్తి మహేశ్ చేసిన ఆరోపణలకు సమాధానం చెప్పాలి. దమ్ముంటే ఆంధ్రాలో సత్తానిరూపించుకోవాలి’’ అని సూచించారు.