Telugu Gateway
Andhra Pradesh

పరిటాల నాకు గుండు కొట్టించలేదు

ఇది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శుక్రవారం నాడు చెప్పిన మాట. తానే షూటింగ్ లో ఉండి చికాకుగా ఉంటే గుండు గీయించుకున్నానని తెలిపారు.. నాకు ఎవరో గుండు గీయిస్తే ఊరుకునే వ్యక్తినా?. అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. పరిటాల రవి తనకు గుండు కొట్టించారనే ప్రచారం జరిగిన అంశంపై ఆయన వివరణ ఇచ్చారు. తమ్ముడు సినిమా షూటింగ్ లో ఉండగా తనకు నాగబాబు ఫోన్ చేసి ఎక్కుడున్నావ్ అని అడిగారని..బిహెచ్ఈఎల్ లో షూటింగ్ లో ఉన్నానని చెప్పినట్లు తెలిపారు. పరిటాల రవి నీకు గుండు కొట్టించాడట అని మా అన్నయ్య నాగబాబే అడిగారు. తాను తిరిగి పరిటాల రవి ఎవరు అడిగితే ...టీడీపీ ఆఫీసు నుంచే ఫోన్ చేసి చెప్పారని నాగబాబు తెలిపారన్నారు. ఆలోచిస్తే ఇది అభాండం అని అర్థం పోయిందని..ఆ ప్రచారం మూడేళ్లు జరిగిందని...చివరకు పేపర్ లో వార్తలు రాసే స్థాయికి అది చేరుకుందని అన్నారు.

శుక్రవారం విజయవాడలో జరిగిన జనసేన పార్టీ కార్యకర్తల సమావేశంలో పవన్ ఈ వ్యాఖ్యలు చేశారు. టీడీపీ వాళ్లే ఈ ప్రచారం చేశారు. అయినా అవన్నీ తాను మనసులో పెట్టుకోలేదన్నారు. అన్ని చేసిన టీడీపీకి గత ఎన్నికల్లో ఎందుకు మద్దతు ఇచ్చానంటే కులాల ఐక్యత కోసమే. వంగవీటి రంగా హత్యపై కూడా పవన్‌ ప్రస్తావించారు. వంగవీటి రంగాను చంపడం తప్పు. విజయవాడలో ఇంకా కులాల వ్యవస్థ నుంచి మారలేదు. నగర ప్రజలు కులం ఉచ్చు నుంచి ఇంకా బయటకు రాలేదని ఆయన వ్యాఖ్యలు చేశారు. పనిలో పనిగా తెలంగాణలో కులాభిమానం తక్కువ.. తెలంగాణ అభిమానం ఎక్కువ అంటూ పవన్‌ పేర్కొన్నారు. అంతేకాకుండా త్వరలో సినిమాలు కూడా పూర్తిగా వదిలేస్తానని తెలిపారు. ఈ ప్రాంతంలో కులాలు, మతాలను దాటితేనే ప్రపంచ స్థాయి రాజధాని నగరాన్ని నిర్మించగలం అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.

Next Story
Share it