చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు..కేంద్రం నుంచి బయటకు
పోలవరం రగడ ముదురుతోంది. ప్రధాని నరేంద్రమోడీ..ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి మధ్య దూరం మరింత పెరిగినట్లు కన్పిస్తోంది. గురువారం అసెంబ్లీ సమావేశం ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలవరం ప్రాజెక్టుకు సాయం చేయబోమని కేంద్రం చెపితే నమస్కారం పెట్టి తప్పుకుంటామని వ్యాఖ్యానించారు. అసెంబ్లీలో పోలవరం అంశంపై ప్రకటన చేసిన చంద్రబాబు ఈ సంగతి లోపల చెప్పకుండా..బయట మీడియా సమావేశంలో చెప్పటంతో కేవలం కేంద్రానికి ఓ ఝలక్ ఇచ్చేందుకు ఇలా మాట్లాడారనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. నిజానికి కేంద్రం ఎప్పుడో 2014 నాటి రేట్లే ఇస్తామని ఎప్పుడో చెప్పింది. వాస్తవానికి అదే ఏపీకి పెద్ద నష్టం . అవేమీ పట్టించుకోని చంద్రబాబు ఇప్పుడు తాను పిలిచిన ఓ టెండర్ నోటిఫికేసన్ ను పక్కన పెట్టాల్సిందిగా ఆదేశించటంతో ఇంత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదంతా చూస్తుంటే చంద్రబాబు తన తప్పులను కూడా కేంద్రంపై నెట్టి రాజకీయ ప్రయోజనం పొందో పనిలో ఉన్నట్లు కన్పిస్తోంది.
విభజన హామీల అమలు విషయంలో తాను రాజకీయం చేయటలేదని..తనకు హామీలు అమలు అయితే చాలన్నారు. తాను ఆశావాదినని..చివరి నిమిషం వరకూ పోరాడుతూనే ఉంటాయనని వ్యాఖ్యానించారు. బిజెపి నాయకులను కేంద్రంతో మాట్లాడమని చెప్పానని..భాగస్వామ్య పార్టీ కాబట్టే బిజెపి విషయంలో సహనంతో ఉన్నట్లు తెలిపారు. పోలవరం సమస్య ఎక్కడ ఉందో తనకే అర్థం కావటంలేదన్నారు. కలసి వస్తామంటే వైసీపీని కూడా ఢిల్లీ తీసుకెళతామని..సహకరించకుంటే మన కష్టం మిగులుతుంది. సహకరిస్తే ఫలితం మిగులుతుంది అని వ్యాఖ్యానించారు. ఈ విషయంలో ప్రధాని మోడీ అపాయింట్ మెంట్ అడుగుతున్నట్లు తెలిపారు .కేంద్రం ఆపమంటే పోలవరం ప్రాజెక్టు ఆపేస్తామని..వాళ్ళే కట్టినా తమకేమీ ఇబ్బందిలేదన్నారు.