Telugu Gateway
Andhra Pradesh

హీరో సిఫారసు చేసినా ‘డీఈవో’ పోస్టు రేటు మారలేదు

సినీ..పొలిటికల్ హీరో సిఫారసు చేస్తే మాత్రం రేటు మారుతుందా?. ముందు ఒకరికి ఇవ్వాలనుకున్నది ఆ హీరో సిఫారసు చేసిన వ్యక్తి పోస్టు ఇవ్వాలని నిర్ణయించారు అంతే. కానీ రేటు మాత్రం ముందు అనుకున్న దానికి ఒక్క రూపాయి కూడా తగ్గలేదు. వైజాగ్ డీఈవో పోస్టును ఏభై లక్షలకు బేరం పెట్టారని విద్యా శాఖ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. ముందు ఓ వ్యక్తి దగ్గర అంతే మొత్తం తీసేసుకున్నారు కూడా. మధ్యలో పొలిటికల్ హీరో రంగంలోకి దిగారు. తనకు తెలిసిన వ్యక్తి కోసం సిఫారసు చేశారు. అంతే ముందు తీసుకున్న ఏభై లక్షల క్యాండిడేట్ ను పక్కకు తప్పుకోమని చెప్పి...హీరో సిఫారసు చేసిన వ్యక్తికి అది ఇవ్వాలని నిర్ణయించారు. మీడియాలో వార్తలు వచ్చి...రిటైర్డ్ జడ్జితో కమిటీ వేసినా డీఈవోల పోస్టింగ్ ల్లో రేట్లు ఏ మాత్రం మారటం లేదని విద్యా శాఖ వర్గాలు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నాయి.

వైజాగ్ తో పాటు రాజధాని ప్రాంతంగా మారిన విజయవాడ, గుంటూరు జిల్లాలకు చెందిన డీఈవో పోస్టులు అంతే హాట్ కేకుల్లా అయిపోతున్నాయి. ఎవరైనా సరే ఈ పోస్టు దక్కించుకోవాలంటే భారీ మొత్తం సమర్పించుకోవాల్సిందే. సమాజాన్ని తీర్చిదిద్దే పాఠశాలలు, కాలేజీలతో కూడిన విద్యా శాఖ నిత్యం అవినీతి వార్తలతో పరువు పొగొట్టుకుంటోంది. సాక్ష్యాత్తూ మంత్రి గంటా శ్రీనివాసరావు కూడా పలు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం ఇచ్చిన జీవోలకే తూట్లు పొడిచి కాలేజీలకు ప్రయోజనం చేకూర్చటం ద్వారా సొంత ప్రయోజనాలు చూసుకుంటున్నారని ఆ శాఖ వర్గాలు చెబుతున్నాయి.

Next Story
Share it